ఈ ఏడాది నుంచే తెలంగాణలో జాబ్ క్యాలెండర్

ఈ ఏడాది నుంచే తెలంగాణలో జాబ్ క్యాలెండర్

 

  • యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్​మెంట్స్​
  • ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం
  • ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాదే భర్తీ 
  • సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు
  • యూపీఎస్సీ, కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం
  • రెండు నెలల కిందే ప్రకటించాలనుకున్నా ఎలక్షన్స్​తో లేట్​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కారు​ కీలక నిర్ణయం తీసుకున్నది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్​ చేయనుంది. సర్కారు ఆదేశాలతో 20‌‌24కు సంబంధించి త్వరలోనే జాబ్​ క్యాలెండర్​ విడుదల​ చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలల కిందే క్యాలెండర్​ ప్రకటించాలని అనుకున్నప్పటికీ.. లోక్​సభ ​ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది.

ఇప్పటికే రాష్ట్ర అధికారులు యూపీఎస్సీ, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ, కేరళ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ రిక్రూట్​మెంట్​విధానాలను అధ్యయనం చేశారు. పక్కాగా జాబ్​ క్యాలెండర్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఏటా టీజీపీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్‌‌‌‌ క్యాలెండర్​ను ప్రకటించనున్నారు. గ్రూప్‌‌‌‌-1, 2, 3, 4తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్స్​ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే..  జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మూడేండ్లు పెంచడంతో గత మూడేండ్లుగా రిటైర్మెంట్స్​ జరగలేదు. ఈ ఏడాది నుంచి ఉద్యోగులు రిటైర్డ్​ అవుతున్నారు. దీంతో ఇందులోనూ డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన ఖాళీల లెక్కలు తీస్తున్నారు. 

2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్​

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు​ ప్లాన్​ చేస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్​కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి, మళ్లీ నోటిఫికేషన్​ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగానే గ్రూప్​–1 లో పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. ఇప్పుడు పోలీసు, టీచర్, గురుకుల, వివిధ పోస్టుల భర్తీతోపాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్​– 2, 3,4 కు సంబంధించి జాబ్​ క్యాలెండర్​ రూపకల్పన చేస్తున్నది. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్​చేయాలనుకుంటున్నది. ఏటేటా రిటైర్మెంట్​అవుతున్న కొద్దీ.. వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ, డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​​పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ 30 వేలకు పైగా  మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించింది.  మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్​మెంట్​బోర్డు పరిధిలో 6,956 స్టాఫ్​నర్స్, పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డు అధ్వరంలో 14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన 7,800 మంది టీచర్లు, లెక్చరర్లకు నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ అధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్​మెంట్​ ద్వారా 87 పోస్టులను భర్తీ చేసింది.  ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డీఎస్సీని  ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

క్యాలెండర్​లోనే అన్నీ స్పష్టంగా.. 

యూపీఎస్సీ, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ, కేరళ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ సిద్ధం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌‌‌‌ ఇస్తారు? ఏయే నెలల్లో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? అనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. ఇందులో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా రిక్రూట్​మెంట్స్​ పూర్తవుతాయి. దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్‌‌‌‌ తీసుకుంటోంది. సర్వీసు నిబంధ నలను ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయడంతోపాటు ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుం టోంది. జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ అమల్లోకి వస్తే టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్యారోగ్య నియామక బోర్డుల నుంచి ఇక ఏటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.