
- ..బీజేపీ పాలనలో మనుధర్మ శాస్త్రం అమలు
హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం కంటే మనుధర్మ శాస్త్రాన్నే ముందుకు తెస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. దీనివల్ల దళితులు కుల వివక్షకు, దాడులకు, హత్యలకు గురవుతున్నారని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని ట్యాంకుబండ్ వద్ద ఆయన విగ్రహానికి జాన్ వెస్లీ పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం చార్మినార్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మోదీ తన కార్పొరేట్ మిత్రులకే దేశ సంపదను పంచుతున్నారని..బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానాలను తిప్పికొట్టాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, ప్రభుత్వ రంగం సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను బడ్జెట్లో కేటాయించలేదని, అసైన్డ్ భూములను, పేదల భూములను అన్యాయంగా లాక్కుని, కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ఇక్కడ కులగణనకు అనుకూలంగా మాట్లాడి, దేశంలో మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.