ఇంటర్​ పరీక్షలకు సంసిద్ధం .. ఏర్పాట్లను పూర్తి చేసిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం

ఇంటర్​ పరీక్షలకు సంసిద్ధం .. ఏర్పాట్లను పూర్తి చేసిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం
  • రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు
  • సీసీ కెమెరాల నిఘాలో నిర్వహణ
  • ఇందూర్ జిల్లాలో 36,222 మంది, కామారెడ్డిలో 18,469 మంది విద్యార్థులు 
  • పరీక్షా సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు 
  • ఆయా శాఖల కోఆర్డినేషన్​కు కలెక్టర్ల ఆదేశాలు​ 

నిజామాబాద్, వెలుగు: ఇంటర్​ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండడంతో పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులను కల్పించారు. మాస్​ కాఫీయింగ్​ జరగకుండా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ, ఎన్​పీడీసీఎల్​, మెడికల్​ డిపార్ట్​, పోలీస్​, పోస్టల్​ శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇది వరకే రెండుసార్లు సమావేశాలు నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు.  

సబ్జెక్ట్​ తెలియని వారే ఇన్విజిలేటర్లు..

నిజామాబాద్​ జిల్లాలో ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్స్ 17,789, సెకండ్​ ఇయర్ విద్యార్థులు 18,433 కలిపి మొత్తం 36,222 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.  ఓకేషనల్ కోర్సుకు సంబంధించి 2,736 మంది విద్యార్థులు ఉండగా, 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్​, తాగునీరు, ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్​ సరఫరా లోపాలను సరిచేశారు. వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో మెడికల్​ డిపార్ట్​మెంట్​ను ఆప్రమత్తం చేసి ఫస్ట్​ ఎయిడ్ చికిత్సను అందుబాటులో ఉంచారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు శాఖల అధికారులు విధుల్లో పాల్గొననున్నారు.

 ప్రతి సెంటర్​ ఆవరణలో 144 సెక్షన్​ అమలు చేయనున్నారు. పరీక్షా సెంటర్​లోనికి ఉదయం 8.15 గంటల నుంచి అనుమతించి 9 గంటలకు గేట్లు క్లోజ్ చేయనున్నారు. ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  జిల్లాలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. ప్రతి సెంటర్​లో ఒకరి చొప్పున మొత్తం 57 మంది చీఫ్​ సూపరింటెండెంట్లు, 57 మంది డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. ముగ్గురు ఫ్లైయింగ్​ స్క్వాడ్ టీంలు, ఎనిమిది మంది సిట్టింగ్ స్వ్కాడ్​, ఒక హైపవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షించనున్నది. సబ్జెక్ట్​​తో సంబంధంలేని  లెక్చరర్లను  ఇన్విజిలేషన్​ కోసం ఎంపిక చేశారు. సెల్​ఫోన్లకు అనుమతి లేదు.    

సీసీ కెమెరాల మధ్య ప్రశ్నాపత్రాల ఓపెన్..​

పోలీస్​ స్టేషన్​కు చేరుకునే ప్రశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందు సెంటర్లకు చేరుతాయి.  సీసీ కెమెరాల మధ్యే ఓపెన్​ చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.  

కామారెడ్డి జిల్లాలో 18,469 మంది విద్యార్థులు

కామారెడ్డి జిల్లాలో ప్రధమ సంవత్సరం విద్యార్థులు 8,743 మంది, ద్వితీయ సంవత్సరం  9,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.  ఇందుకుగాను 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను  చీఫ్​ సూపరింటెండెంట్లు, డిపార్ట్​మెంట్ అధికారులు పర్యవేక్షించనున్నారు.