
కౌడిపల్లి, వెలుగు: గ్రామాల్లో నల్లాలకు ఎవరైనా మోటార్లు బిగిస్తే సీజ్ చేసి వారికి ఫైన్ వేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా తాగునీటి స్పెషల్ ఆఫీసర్ భారతి హోలీకేరి అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామాన్ని సోమవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో తిరిగి తాగునీటి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో 20 రోజుల నుంచి వాటర్ రావడం లేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఆమె మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్య ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ఆమె వెంట మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, మిషన్ భగీరథ ఈఈ కమలాకర్, ఇంట్రా ఈఈ సంపత్ కుమార్, ఆర్డబ్ల్యూ ఎస్ఎస్ఈ రఘువీర్, డీఈ కిషన్, తహసీల్దార్ఆంజనేయులు, ఎంపీడీవో శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దివ్య మహిపాల్ రెడ్డి ఉన్నారు.
తాగునీటి ఇబ్బంది రావొద్దు
సిద్దిపేట రూరల్: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలని భారతి హోలికేరి అధికారులను అదేశించారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో తాగునీటి సరఫరా పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు రుపొందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.