అట్టహాసంగా జేపీఎల్‌ ట్రోఫీ ఆవిష్కరణ.. ఈ నెల 20 నుంచి టీ20 క్రికెట్ లీగ్

అట్టహాసంగా జేపీఎల్‌ ట్రోఫీ ఆవిష్కరణ.. ఈ నెల 20 నుంచి టీ20 క్రికెట్ లీగ్

హైదరాబాద్‌: కేఎస్‌జీ జర్నలిస్ట్  ప్రీమియర్‌ లీగ్‌ (జేపీఎల్‌) ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకకు బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, శాట్జ్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, ట్రోఫీలను ఆవిష్కరించారు. అనంతరం కేఎస్‌జీ సంస్థ చైర్మన్‌, ఇండి రేసింగ్‌ టీమ్ ఓనర్ కె.అభిషేక్‌ రెడ్డి, త్రుక్ష ఫుడ్స్‌ ఎండీ సీహెచ్. భరత్‌ రెడ్డి, లైఫ్‌స్పాన్‌ ప్రతినిధి భరణి 10 జట్ల  కెప్టెన్లకు క్యాప్స్‌ ప్రదానం చేశారు.

ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ టీ20 టోర్నీలో  వెలుగు, వి6 జట్లు సహా మొత్తం పది మీడియా సంస్థలకు చెందిన  జట్లు తలపడనున్నాయి. ట్రోఫీ ఆవిష్కరణ త‌ర్వాత‌ ఎమ్మెస్కే మాట్లాడుతూ ప్రొఫెషనల్‌ పద్ధతిలో జర్నలిస్టులు క్రికెట్‌ ఆడనుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏ క్రీడలోనైనా వర్ధమాన ఆటగాళ్లను పైకి, వెలుగులోకి తీసుకురావాలంటే అది క్రీడా జర్నలిస్టులతోనే సాధ్యమని, వారి కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి, గౌరవించాలన్నారు.

 శివసేనారెడ్డి మాట్లాడుతూ జేపీఎల్‌తో క్రీడల ప్రాధాన్యత, అవశ్యకతపై ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్లనుందని చెప్పారు. శాట్జ్‌ తరఫున పూర్తి సహాయసహకారలందిస్తామని హామీ ఇచ్చారు. అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ జేపీఎల్‌ అనే ఆలోచన రావడం గొప్ప విషయమని, నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఈ లీగ్‌తో కొంత ఆటవిడుపు లభించడం సంతోషకరమైన విషయమన్నారు. లీగ‌ఖ‌లో ఆడుతున్న అన్ని టీమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ | IND vs ZIM 2024: చివరి టీ20 మనదే.. 4-1 తేడాతో సిరీస్ గెలిచిన భారత్

భరత్‌ రెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోరే జర్నలిస్టులందరూ ఇలా ఒకే వేదికపై కలిసి, లీగ్‌లో ఆడనుండడం కనులపండుగగా ఉందన్నారు. భరణి మాట్లాడుతూ జేపీఎల్‌లో జర్నలిస్టులందరూ రాణించాలని, లీగ్‌ విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్త‌ పత్రికలు, చానెళ్ల నుంచి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.