
- తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్కు క్రెడిట్ అలర్ట్
- ఆ మెసేజ్ చూసి యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోని డబ్బు గాయబ్!
- డిపాజిట్ చేసిన మొత్తానికి చివర సున్నా చేర్చి అందినకాడికి దోపిడీ
- మెసేజ్ల రూపంలోనూ యూపీఐ లింకులు, క్లిక్ చేస్తే అంతే..!
- యూపీఐలో అడ్డగోలుగా పెరుగుతున్న జంప్ డిపాజిట్ స్కామ్స్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లో ఎంతోకొంత డబ్బు డిపాజిట్ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. డిపాజిట్ చేసిన మొత్తానికి సున్నా చేర్చి వందలను వేలుగా.. వేలను లక్షలుగా మార్చి కొట్టేస్తున్నారు. రీఫండ్ చేయకపోతే కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా యూపీఐ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాలను “జంప్ డిపాజిట్ స్కామ్స్’’గా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ గుర్తించింది. పేమెంట్ గేట్వేస్, ఈ కామర్స్, జాబ్ పోర్టల్స్ టార్గెట్గా జరుగుతున్న ఈ కొత్త తరహా మోసాల పట్ల అలర్ట్గా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది. అన్ని రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకూ అలర్ట్స్ జారీ చేసింది. మనకు తెలియకుండానే ఎంతో కొంత డబ్బు డిపాజిట్ అయినట్లు మెసేజెస్ రాగానే వెంటనే యూపీఐ పేమెంట్ యాప్స్ను ఓపెన్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
సున్నా చేర్చి ఏమార్చి..
సైబర్ నేరగాళ్లు ఫోన్పే, గూగుల్ పేతోపాటు ఇతర పేమెంట్ గేట్వేస్తో లింకులు జనరేట్ చేస్తున్నారు. రూ.1000 నుంచి రూ.5 వేలదాకా డిపాజిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్రెడిట్ అలెర్ట్ మెసేజ్ పంపిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి మెసేజ్ వచ్చిన వెంటనే ఫోన్పేలోనో, జీపేలోనో బ్యాలెన్స్ చెక్ చేస్కుంటాం. దీన్నే సైబర్ నేరగాళ్లు అదునుగా చేసుకున్నారు. క్రెడిట్ అలర్ట్స్ లింకులు క్రియేట్ చేస్తున్నారు. తాము డిపాజిట్ చేసిన మొత్తానికి చివర ‘సున్నా’ కలుపుతున్నారు. రూ.వందల్లో పంపిన మొత్తం వేలుగా..వేలల్లో డిపాజిట్ చేసిన మొత్తం లక్షలుగా మార్చేస్తున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసేందుకు మనం యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లు అప్పటికే ఎంటర్ చేసుకున్న అమౌంట్ మొత్తం వాళ్ల యూపీఐ ద్వారా వాళ్ల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అయ్యేలా లింకులు క్రియేట్ చేసి పంపిస్తున్నారు.
రీఫండ్ చేయాలని రిక్వెస్టులు, లేదంటే బెదిరింపులు
యూపీఐని వాడనివాళ్లకు సైబర్ నేరగాళ్లు కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. మరొకరి అకౌంట్కి పంపాల్సిన డబ్బు పొరపాటున మీకు పంపించామని, రివర్స్ కొట్టండి అంటూ రిక్వెస్ట్ చేస్తారు. అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని సూచిస్తారు. మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి ఫోన్పే లేదా జీపేకి రిఫండ్ చేయాలని కోరుతారు. ఇక్కడే అసలు మోసం ఉంటుంది.
సైబర్ నేరగాళ్లు పంపించిన మెసేజ్లో ఉదాహరణకు రూ.5 వేలు డిపాజిట్ అయినట్లుంటే.. వారు పంపించే లింకులో మాత్రం రూ.50 వేలు తమ అకౌంట్కి క్రెడిట్ అయ్యేలా ఫీడ్ చేస్తున్నారు. దీంతో లింక్ ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే సైబర్ నేరగాళ్ల టార్గెట్ పూర్తవుతుంది. వాళ్లు చెప్పినట్టుగా రీఫండ్ చేయనివాళ్లకు కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పెడ్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
ఈ కామర్స్లో ఓవర్ పేమెంట్, జాబ్ రీఫండ్ స్కామ్..
ఓఎల్ఎక్స్, ఫేస్బుక్, మార్కెట్ ప్లేస్ లాంటి ఈ కామర్స్ సైట్లలోనూ సైబర్ నేరగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మకానికి పెట్టిన వస్తువులను కొంటామని నమ్మించి, రేట్లు తగ్గించాలని అడుగుతున్నారు. చివరకు ఓ రేటు ఫిక్స్ చేసుకున్నాక డబ్బులు యూపీఐ ద్వారా చెల్లిస్తామని చెప్తారు. ఫిక్స్ అయిన రేటు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపినట్లు నమ్మిస్తారు. అదనంగా వచ్చిన డబ్బు రీఫండ్ చేయాలని కోరి మోసాలకు పాల్పడతారు. ఈ రీతిలో నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తున్నారు. రిక్రూటర్లుగా వ్యవహరిస్తూ.. మెసేజ్లు పంపిస్తున్నారు. అధిక మొత్తంలో జీతాలంటూ ఆశ పెట్టి, ట్రాప్ చేస్తున్నారు.
వెరిఫికేషన్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ పేరుతో హంగామా చేస్తారు. సెలెక్ట్ అయ్యారని నమ్మిస్తారు. అడ్వాన్స్ సాలరీ లేదా జాయినింగ్ బోనస్ పేరుతో బ్యాంకులో చెక్ డిపాజిట్ చేశామని చెప్తారు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా డిపాజిట్ చేశామని.. టెక్నికల్ ఇష్యూస్ వల్ల చెక్ క్యాష్ కాలేదని నమ్మిస్తారు. ఇందుకు సంబంధించి నకిలీ రిసిప్టులను బాధితులకు పంపిస్తారు. ఎక్కువగా డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని సూచిస్తారు. లేదంటే ఉద్యోగం రాకపోగా..రిమార్క్స్ చేస్తామని బెదిరిస్తారు.
ఇలాంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే.. ఫోన్పే లేదా జీపే యాక్టివేట్ అవుతుంది. కానీ ఇలాంటి డిపాజిట్స్ జరిగినప్పుడు 15 నుంచి 30 నిమిషాల పాటు యూపీఐని వాడొద్దు. మనం ఆ లింకులు ఓపెన్ చేశామంటే స్కామర్లు ఫీడ్ చేసుకున్న మొత్తం ఇతర ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మ్యూల్ అకౌంట్స్, కొనుగోలు చేసిన బ్యాంక్ అకౌంట్ల ద్వారా విత్డ్రా చేస్కుంటరు. ఇలాంటి మోసానికి గురైతే వెంటనే 1930 లేదా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి.
విశ్వనాథ్ చింతకింది, ఎథికల్ హ్యాకర్, ఎన్ఐవీఐ సొల్యూషన్స్, హైదరాబాద్