
ఆదిలాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు శనివారం మెడికల్ కాలేజీ ఎదుట నిరసన తెలిపారు. జూడాల సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే ఈ నెల 24 నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ చెల్లించాలని, హాస్టల్లో వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.
పలు జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు లేక మెడికోలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మేరకు మొత్తం 8 డిమాండ్లతో కూడిన నోటీసు ఇచ్చామని వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూడాలు రాజు, కార్తిక్, మురుగన్, తదితరులు ఉన్నారు.