
న్యూఢిల్లీ, వెలుగు: మనీ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ అన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్టు చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్ల లోనే బెట్టింగ్ యాప్ లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఈ యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్త చేశారు.
క్రీడాకారులు, సినీ నటులను యువత రోల్ మోడల్ గా తీసుకుంటారని.. కానీ, వారంతా సైతాన్లుగా మారారని ఫైర్ అయ్యారు. పరోక్షంగా ఇంత మంది చావులకు వాళ్లే కారణమయ్యారని ఆరోపించారు. వీటి ద్వారా బెట్టింగ్ యాప్ లు వేల కోట్ల ఆదాయం అర్జిస్తోన్నా... ప్రభుత్వాలు మౌనం వహించాయని మండిపడ్డారు. మనీ గేమింగ్ యాప్స్ అన్నింటిని తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.