ఖనిజాల కోసం ఖండాంతరాలకు..మనదేశంలోనూ త్వవకాలు

ఖనిజాల కోసం ఖండాంతరాలకు..మనదేశంలోనూ త్వవకాలు

 ఆఫ్రికా, ఆస్ట్రేలియాకు కాబిల్​
మనదేశంలోనూ తవ్వకాలు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: విలువైన ఖనిజాల తవ్వకాల కోసం ఖనిజ్​విదేశ్​ ఇండియా లిమిటెడ్​(కాబిల్​) విదేశాల బాట పట్టింది. క్రిటికల్​ మినరల్​ అసెట్స్ ​కోసం ఇది ఆఫ్రికాలోని కాంగో, జాంబియా, టాంజానియాతోపాటు ఆస్ట్రేలియాలో వెతుకులాట మొదలుపెట్టిందని కేంద్రం గురువారం ప్రకటించింది. కేంద్ర గనులశాఖ కార్యదర్శి వీఎల్ ​కాంతారావు ఈ విషయమై మాట్లాడుతూ ఈ దేశాల్లో రాగి, లిథియం, నికెల్​, కోబాల్ట్​ వంటి అరుదైన లోహాలు ఉన్నాయని భావిస్తున్నామని పేర్కొన్నారు.

‘‘ఆస్ట్రేలియా ప్రభుత్వం గనుల తవ్వకం కోసం కాబిల్​తో  కలసి  పనిచేస్తోంది. కాంగో, టాంజానియాతోపాటు మరికొన్ని దేశాల్లోనూ క్రిటికల్​ మినరల్​అసెట్స్​ కోసం వెతుకుతున్నాం”అని వివరించారు. మనదేశంలో క్లీన్​ ఎనర్జీకి డిమాండ్ ​విపరీతంగా పెరుగుతుండటంతో ఖనిజాల కోసం కేంద్రం చాలా శ్రద్ధ చూపుతోంది. లిథియం, కోబాల్ట్​ వంటి ఖనిజాలను విండ్​ టర్బైన్లు, ఎలక్ట్రిసిటీ నెట్​వర్క్​లు, బ్యాటరీ తయారీల్లో వాడతారు. కాబిల్​తో పాటు కోల్​ఇండియా, ఎన్​ఎండీసీ, ఓఎన్​జీసీ విదేశీ లిమిటెడ్​(ఓవీఎల్​) కలిసి విలువైన ఖనిజాల బ్లాకుల కోసం ఆస్ట్రేలియాలో అన్వేషిస్తున్నాయి.  

కోబాల్ట్​, కాపర్ వంటి ఖనిజాలను వెలికి తీసేందుకు తొమ్మిది వేల కిలోమీటర్ల గ్రీన్​ఫీల్డ్​ ఏరియాను మనదేశానికి కేటాయించేందుకు జాంబియా అంగీకరించింది. ఖనిజాన్వేషణకు రెండుమూడేళ్లు పడుతుందని, ఎక్స్​ప్లోరేషన్​ తరువాత మైనింగ్​హక్కులు కూడా లభిస్తాయని భావిస్తున్నామని కాంతారావు చెప్పారు. లిథియంకు చాలా డిమాండ్​ ఉందని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్​గఢ్​లో లిథియం బ్లాకులు ఉన్నాయని కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డి చెప్పారు. జమ్మూకాశ్మీర్​లో మరిన్ని తవ్వకాలు జరపడానికి కేంద్రం ప్రత్యేకంగా జీఎస్​ఐ టీమ్​ను నియమించింది. 

మే చివరి నాటికి ఈ విషయంలో స్పష్టత వస్తుందని, ఆ తరువాత వేలం నిర్వహిస్తామని రెడ్డి చెప్పారు. లైసెన్స్ ​బ్లాకుల్లో తవ్వకాల కోసం వచ్చే నెల వేలం వేస్తామని కూడా వెల్లడించారు. గ్రీన్​ఎనర్జీలో స్వయం సమృద్ధిని సాధించడానికి కేంద్రం గత నెల నేషనల్ ​క్రిటికల్​ మినరల్​ మిషన్​ను ప్రారంభించింది. ఏడేళ్లలో దీనికోసం రూ.34,300‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట్లు ఖర్చు చేస్తారు. విలువైన ఖనిజాల కోసం తీర ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతారు. పబ్లిక్​ సెక్టార్​ కంపెనీలు ఈ మిషన్​కు రూ.18 వేల కోట్ల వరకు సమకూరుస్తాయి.