కాళేశ్వరం కమిషన్​ గడువు .. మరో నెల పొడిగింపు

కాళేశ్వరం కమిషన్​ గడువు  .. మరో నెల పొడిగింపు
  • ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • వచ్చే నెల రెండో వారం నాటికి రిపోర్ట్​ ఇచ్చే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ గడువును రాష్ట్ర సర్కారు మరో నెలపాటు పొడిగించింది. మే 31 నాటికి తుది నివేదికను సమర్పించాలని పేర్కొంటూ మంగళవారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఐదోసారి కమిషన్​ గడువును పొడిగించినట్టయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్​ 21న కుంగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే విజిలెన్స్​, ఎన్డీఎస్ఏ తుది నివేదికలు ప్రభుత్వానికి చేరాయి.  కాళేశ్వరం కమిషన్​ నివేదిక ఒక్కటే రావాల్సి ఉంది. ఇప్పటికే రిపోర్ట్​పై కమిషన్​ కసరత్తులు చేస్తున్నది. 90 శాతం వరకు పూర్తయింది. మే రెండో వారంలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించేలా కమిషన్ పనిచేస్తున్నది.

కాగా, సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జి,  ఫస్ట్​ లోక్​పాల్​జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ చైర్మన్​గా కమిషన్​ను ప్రభుత్వం 2024 మార్చి 14న ఏర్పాటు చేసింది. 2024 జూన్​ 30 నాటికి నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే, అప్పటికీ విచారణలు పూర్తి కాకపోవడం, అధికారుల అఫిడవిట్లు రాకపోవడంతో విచారణ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు సర్కారు గడువును పొడిగిస్తూ వచ్చింది. తొలిసారి నిరుడు జూన్​ 29న గడువు పొడిగించగా.. ఆ తర్వాత ఆగస్టు 28న, నవంబర్​ 12న, డిసెంబర్​ 21న 4 సార్లు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా రిపోర్ట్​ను సమర్పించాల్సి ఉండడంతో ఐదోసారి గడువును పొడిగించాల్సి వచ్చింది. 

కమిషన్​ ముందుకు ఈఎన్సీ అనిల్​

కాళేశ్వరం కమిషన్​ ముందు ఈఎన్సీ జనరల్​ అనిల్​కుమార్​ హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పలు అంశాలపై కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ ఆరా తీశారు. ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్ట్​ విడుదల కాగా.. దాని గురించి జస్టిస్​ ఘోష్​ అడిగినట్టు తెలిసింది. అయితే, తమకు కూడా అధికారికంగా రిపోర్టు ఇంకా చేరలేదని ఈఎన్సీ అనిల్​ చెప్పినట్టు తెలిసింది. సెక్రెటరీ ద్వారా హార్డ్​కాపీలను బుధవారం కమిషన్​కు అందజేయనున్నట్టు సమాచారం. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై జస్టిస్​ ఘోష్​ ఆరా తీయగా.. ఫ్లడ్​ రూటింగ్​ చేస్తే బ్యారేజీ సేఫ్​గా ఉంటుందని అనిల్  వివరించినట్టు తెలిసింది.