క్వాలిటీ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారు?..కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం

క్వాలిటీ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారు?..కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
  •  సీఈ అజయ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
  •  ఇప్పటి వరకు ఎన్ని సార్లు మేడిగడ్డ, అన్నారం విజిట్ చేశారు..?
  • సుందిళ్లను ఎందుకు పరిశీలించలేదన్న కమిషన్
  • ‌‌ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ప్రమాదం జరగకముందు విజిట్ చేశానన్న సీఈ
  • ఓపెన్ కోర్టు లో వాడి వేడిగా విచారణ

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత  క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అజయ్ కుమార్ పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. క్వాలిటీ కంట్రోల్ సిఇ స్థాయిలో ఉండి రికార్డ్స్ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా సబ్మిట్ చేస్తారని ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ పని ఏంటి? పరిధి ఏంటి? ఇప్పటివరకు ఏం పని చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఎన్నిసార్లు విజిట్ చేశారని అడిగింది. దీనికి ఈ రెండు బ్యారేజీలను ప్రమాదం జరగక ముందు పరిశీలించానని తెలిపారు. సుందిళ్లను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించింది. మొదటి సారి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మూడు బ్యారేజీలను క్వాలిటీ కంట్రోల్ సీఈగా  విజిట్ చేశారా..? అని కమిషన్ ప్రశ్నించింది. గ్రౌండ్ లో సమస్యలు ఉన్నాయని రిపోర్టులు రావడంతో విజిట్ చేయలేదని అజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. 

ఈఎన్సీకి 130 ప్రశ్నలు

ఇవాళ ఉదయం విచారణకు హాజరైన ఈఎన్సీ నాగేందర్ పై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు మూడు గంటలపాటు ఆయనను ప్రశ్నించింది.  దాదాపు 130కి పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌లో నిబంధనలు పాటించలేదని నాగేందర్ తెలిపారు. రామగుండం ఈఎన్‌సీ చేతిలోనే మూడు బ్యారేజీలు నడిచినట్లు కమిషన్ ముందు చెప్పారు. ఆయన నిబంధనలు పాటించలేదని తెలిపారు.  మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే బ్యారేజీలలో లీకేజీలు జరిగాయా అని.. గేట్స్ ఆపరేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? నీళ్లను ఎవరు స్టోరేజ్ చేయమన్నారని కమిషన్ ప్రశ్నించింది. వరదల సమయంలో గేట్లు ఓపెన్ చేయకూడదని ఎవరు ఆదేశించారని అడిగింది.  మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ మాన్యువల్ ప్రిపేర్ చేసిందా అంటూ ఈఎన్‌సీ నాగేందర్‌‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.  2021 జనవరి వరకు ఆపరేషన్ సైన్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకమైన సిబ్బంది లేరని కమిషన్ ముందు నాగేందర్ తెలిపారు. 2021 జనవరిలో ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ టీం ఫామ్ అయిన తర్వాత రామగుండం ఈఎన్‌సీకి రిపోర్టు ఇచ్చామని తెలిపారు.