కాళేశ్వరం కమిషన్​ విచారణలో బయటపడుతున్న తప్పిదాలు

కాళేశ్వరం కమిషన్​ విచారణలో బయటపడుతున్న తప్పిదాలు

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కాఫర్​ డ్యామ్ కోసం నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేయబోమని అగ్రిమెంట్​లో ఉన్నప్పటికీ  ఆ అగ్రిమెంట్​ను తుంగలో తొక్కి  సంస్థకు రూ.  61.21 కోట్లు చెల్లించడమేందని కాళేశ్వరం జ్యుడిషయ్​ కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పేమెంట్లు ఎవరు చేయాలని ఆదేశించారని రామగుండం సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డిని ప్రశ్నించింది. పలు కారణాలతో సంస్థకు గత సర్కారే చెల్లింపులు చేయాలని ఆదేశించిందని సుధాకర్​ రెడ్డి వెల్లడించారు. ఇది నిధులను దారి మళ్లించడం కిందికి రాదా? అని కమిషన్​ నిలదీసింది.  ఓపెన్​ కోర్టు విచారణలో భాగంగా శనివారం సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డిని జ్యుడీషియల్​ కమిషన్​ విచారించింది. కాఫర్​ డ్యామ్​ నిర్మాణానికి అయిన వ్యయ చెల్లింపులు, నిర్మాణ సంస్థకు సబ్​స్టాన్షియల్​ కంప్లీషన్​ సర్టిఫికెట్​ జారీ తదితర అంశాలపై కమిషన్​ ప్రశ్నించింది. విచారణ సందర్భంగా అప్పటి ఇరిగేషన్​ శాఖ మంత్రి హరీశ్​రావు పేరును రెండు మూడుసార్లు సీఈ ప్రస్తావించారు. 

అదనపు చెల్లింపులతో నష్టమే కదా?

‘‘కాఫర్​ డ్యామ్​కు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని అగ్రిమెంట్​లో ఉన్నప్పుడు చెల్లింపులు ఎలా చేశారు..? చెల్లింపులు చేయాలంటూ ఎవరు ఆదేశించారు?’’ అని సీఈ సుధాకర్​రెడ్డిని కమిషన్​ ప్రశ్నించింది. స్టాండర్డ్​ బిడ్​ డాక్యుమెంట్​ ప్రకారం నాలా లేదా వాగు లేదా డ్రైనేజీల మీదుగా నిర్మించే కాఫర్​ డ్యామ్​ ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని ఉందని.. కానీ, మేడిగడ్డ విషయంలో అది జీవనది కావడం, భారీ వరదను మళ్లించాల్సి రావడంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని సుధాకర్​రెడ్డి పేర్కొన్నారు. చెల్లింపులు చేయాలని చెప్పిందెవరని ప్రశ్నించగా.. నాటి ప్రభుత్వం నుంచే ఆదేశాలు వచ్చాయని ఆయన అన్నారు. 

చెల్లింపులు చేయాలని అప్పటి సీఎం పలు సమావేశాల్లోనూ చెప్పారని, దానికి సంబంధించిన మీటింగ్​ మినిట్స్​లో ఆ విషయం ఉందని వివరించారు. కాఫర్​ డ్యామ్​ ఎత్తు పెంపుకు సంబంధించి చెల్లింపులు చేశారన్నారు. అప్పటి మంత్రి హరీశ్​ రావు, ఈఎన్​సీ జనరల్​ సైట్​ను పరిశీలించి.. ఆ పనులకు ఓకే చెప్పి చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని ఆయన వెల్లడించారు. అదనపు చెల్లింపులతో ప్రభుత్వానికి నష్టమే కదా అని కమిషన్​ నిలదీయగా.. నష్టమేనని సీఈ సుధాకర్​రెడ్డి అన్నారు. సవరించిన అంచనాల్లో కాఫర్​ డ్యామ్​ నిర్మాణం కోసం నిర్మాణ సంస్థకు ఒరిజినల్​ ఒప్పందంలోని నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.61.21 కోట్లు కావాలనే చెల్లించడం ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్టు కాదా? అని కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాళేశ్వరం కార్పొరేషన్​ను ఏర్పాటు చేసిందెవరు?

కాళేశ్వరం కార్పొరేషన్​ను ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటని జ్యుడీషియల్​ కమిషన్​ ప్రశ్నించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సహకారం అందించేందుకు స్పెషల్​ పర్పస్​ వెహికల్​గా దానిని ఏర్పాటు చేశారని సీఈ సుధాకర్​ రెడ్డి చెప్పారు. అయితే, కార్పొరేషన్​కు ఆస్తులేమీ లేవు కదా.. అప్పులే ఉన్నాయి కదా అని కమిషన్​ పేర్కొంది. ఈ కార్పొరేషన్​ను ఏ శాఖ ఏర్పాటు చేసిందని.. ఏర్పాటు చేయాల్సిందిగా ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. కార్పొరేషన్​ను ఇరిగేషన్​ శాఖ ఏర్పాటు చేయగా.. ఇరిగేషన్​ శాఖ మంత్రిగా నాడు హరీశ్​ రావు ఉన్నారని సీఈ చెప్పారు. 

బ్యారేజీ ఎస్టిమేట్స్​ను నాటి ప్రభుత్వమే ఆమోదించిందన్నారు. ఇరిగేషన్​ శాఖకు అప్పటి స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ను 2018లో.. రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ 2ను మేడిగడ్డకు 2021లో, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు 2022లో ఆమోదించారని తెలిపారు. ‘‘బ్యారేజీ సైట్​లో డీవాటరింగ్​ కోసం అంచనాలను ఏకంగా 49.61 శాతం పెంచారు కదా.. ఎందుకు పెంచారు.. ఉత్తర్వులున్నాయా?’’ అని కమిషన్​ ప్రశ్నించింది. రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ 1 వరకు వోగ్​ బుక్​లోని రూల్స్​కు తగ్గట్టు ఓరల్​ ఆదేశాలతోనే చెల్లింపులు చేశారని సీఈ పేర్కొన్నారు. రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ 2 సమయంలో తాను లేనన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్​ డీపీఆర్​ను వ్యాప్కోస్​కు ఇవ్వాలని ఎవరు ఆదేశించారంటూ సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డిని కమిషన్​ ప్రశ్నించింది. ప్రభుత్వమే వ్యాప్కోస్​కు ఆ పనులను అప్పగించిందని ఆయన సమాధానమిచ్చారు. మంత్రి ఆదేశించారా..? ఆ సమయంలో ఇరిగేషన్​ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నారని కమిషన్​ ప్రశ్నించగా.. అప్పుడు హరీశ్​ రావు ఇరిగేషన్​ మంత్రిగా ఉన్నారని సీఈ వివరించారు. వ్యాప్కోస్​కు డీపీఆర్​ బాధ్యతలను నామినేషన్​ పద్ధతిలో ఇవ్వాలన్న నిర్ణయం ఎవరిదని కమిషన్​ నిలదీయగా.. ప్రభుత్వం నుంచే  జరిగిందని, నాటి మంత్రే చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కటాఫ్​ డిజైన్లను ఖరారు చేసే విషయంలో కాంట్రాక్ట్​ సంస్థతో సంప్రదింపులు చేయాలంటూ 2017 జనవరి 11న సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ సీఈ లెటర్​ రాశారని పేర్కొన్నారు. 

గేట్​ ఆపరేషన్​ ప్రొటోకాల్​ పాటించలేదా..

మేడిగడ్డ విషయంలో గేట్​ ఆపరేషన్​ ప్రొసీజర్​ ఫాలో అయినట్టు లేదని.. దానికి విరుద్ధంగా 0.3 మీటర్ల ఎత్తులేపి నీటిని వదిలారా? అని కమిషన్​ ప్రశ్నించింది. తొలుత వరద వేగాన్ని నియంత్రించేందుకు 0.3 మీటర్ల ఎత్తుకు గేట్లను ఎత్తుతారని, కొంత సమయం తర్వాత ఎత్తును పెంచుతూ పోతారని సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డి తెలిపారు. గేట్ల ఆపరేషన్​ను నిర్లక్ష్యంగా చేయడం వల్లే అన్నారం బ్యారేజీలో ఆప్రాన్​ డ్యామేజయిందా?.. అందుకే సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయా? అని కమిషన్​ ప్రశ్నించింది.

 గేట్లను తక్కువ ఎత్తు లేపడం వల్ల వరద ప్రవాహ వేగం ఎక్కువై సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, ఆప్రాన్​ దెబ్బతిన్నదని సీఈ వివరించారు. గేట్లు ఎత్తినప్పుడు దిగువకు వెళ్లే వరద ప్రవాహ వేగాన్ని తగ్గించే (ఎనర్జీ డిసిపేషన్​) ఏర్పాట్లు సరిగ్గా లేవని తెలంగాణ ఇంజనీరింగ్​ రీసెర్చ్​ లేబొరేటరీస్​ మోడల్​ స్టడీస్​లో వెల్లడైందని అన్నారు. నిర్మాణ సంస్థ పనులను ఆలస్యం చేస్తున్నా.. పెనాల్టీ లేకుండానే గడువు ఎందుకు పొడిగించారని సీఈని కమిషన్​ ప్రశ్నించింది. సైట్​లో కోల్​బెడ్​ ఉందని తెలిసినా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారా అని కొట్టె సుధాకర్​ రెడ్డిని జుడీషియల్​ కమిషన్​ ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు. 

అయితే, జాధవ్​పూర్​ యూనివర్సిటీ, సార్దీప్​ ఇంజనీరిం కన్సల్టింగ్​ సంస్థలు కలిసి స్టడీ చేసి రిపోర్ట్​ ఇచ్చాయి.. ఆ రిపోర్ట్​ చదివారా అని సీఈని కమిషన్​ ప్రశ్నించింది. దానికి చదివానని సీఈ చెప్పడంతో.. ఆ రిపోర్ట్​లో కోల్​బెడ్​ ఉన్నట్లు ఆ రెండు సంస్థలు స్పష్టంగా చెప్పాయని, అలాంటప్పుడు కోల్​ బెడ్​ లేదని ఎలా అంటారని కమిషన్​ ప్రశ్నించింది. అయితే, ఆ వెంటనే.. సీఈ తన సమాధానాన్ని మార్చుకున్నారు. కేవలం ఒకే ఒక్క బోర్​హోల్​ టెస్ట్​లో 150 మిల్లీమీటర్ల మందంతోనే బొగ్గు ఆనవాళ్లు బటపడ్డాయని తెలిపారు. 

పనులు చెక్​ చేయడం మీ బాధ్యత కాదా?

మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయ్యాయో లేదో చూడకుండానే నిర్మాణ సంస్థకు సబ్​స్టాన్షియల్​ కంప్లీషన్​ సర్టిఫికెట్​ (ఎస్​సీసీ) ఇవ్వడంపై కమిషన్​ మండిపడింది. అసలు వాటిని ఎవరు జారీ చేశారని సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డిని ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీ ఎస్​సీసీని అప్పటి ఈఈ బి.వి. రమణా రెడ్డి జారీ చేస్తే.. దానిపై తాను కౌంటర్​ సైన్​ చేశానని చెప్పారు. కంప్లీషన్​ సర్టిఫికెట్ (సీసీ)​ను అప్పటి ఈఈ తిరుపతి రావు జారీ చేస్తే.. ఆ తర్వాత ఎస్​ఈగా ప్రమోషన్​ పొందిన బి.వి. రమణా రెడ్డి సంతకం చేశారని తెలిపారు. 

సుందిళ్ల బ్యారేజీకి నాటి ఈఈ ఓంకార్​ సింగ్​ సీసీని ఇస్తే.. రమణా రెడ్డి సంతకం చేశారని పేర్కొన్నారు. అసలు సబ్​స్టాన్షియల్​ కంప్లీషన్​ సర్టిఫికెట్​ అంటే ఏంటి అని కమిషన్​ ప్రశ్నించగా.. 90 శాతం పనులు పూర్తయి బ్యారేజీ వాడుకునేందుకు వీలుగా ఉంటే ఎస్​సీసీని జారీ చేస్తారని చెప్పారు.  ఎస్​సీసీని జారీ చేసే ముందు బ్యారేజీ వద్ద పనులు అయ్యాయో లేదో చెక్​చేశారా? అందుకు రికార్డులేమైనా ఉన్నాయా? అని కమిషన్​ ప్రశ్నించగా.. రికార్డులేవీ ఉండవని, పనులను కూడా తాను చెక్​ చేయలేదని, చేయాల్సిన అవసరం లేదని, నిర్మాణ సంస్థ రిక్వెస్ట్​ మేరకు జారీ చేశామని సుధాకర్​ రెడ్డి చెప్పారు. 

దీనిపై కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పనులు జరిగాయో లేదో చెక్​ చేయకుండా ఎస్​సీసీ ఎలా జారీ చేశారు? నిర్మాణ సంస్థ రిక్వెస్ట్​ చేసినప్పుడు ఇవ్వబోమని తిరస్కరించాల్సింది కదా. ఎవరో వచ్చి రిక్వెస్ట్​ చేశారని పనులు జరిగాయో లేదో చెక్​ చేయకుండా ఎస్​సీసీని జారీ చేస్తారా? పనులను చెక్​ చేయాల్సిన బాధ్యత మీపై లేదా.. అది మీ డ్యూటీ కాదా’’ అంటూ మండిపడింది. ఒరిజినల్​ అగ్రిమెంట్​లోని క్లాజ్​ 42.2బీ ప్రకారం నిర్మాణ సంస్థకు ఎస్​సీసీని జారీ చేయొచ్చంటూ సీఈ సుధాకర్​రెడ్డి సమాధానం చెప్పారు.