కాళోజీ కళాక్షేత్రం రెడీ.. 9న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాళోజీ కళాక్షేత్రం రెడీ.. 9న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వరంగల్, వెలుగు: ఓరుగల్లులో ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రం రెడీ అవుతోంది. హనుమకొండ బస్టాండ్​రోడ్​హయగ్రీవచారి గ్రౌండ్‎లో ఏండ్ల తరబడి తుప్పుపట్టిన సలాకలు.. రంగుల్లేని గోడలతో దర్శన మిచ్చిన కళాక్షేత్రం ప్రస్తుతం కలర్​ఫుల్‎గా కనిపిస్తోంది. పదేండ్ల కింద కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ శంకుస్థాపన చేసింది. పనులు సాగదీసి పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కళాక్షేత్రం నిర్మాణ పనులపై ఫోకస్ చేసింది. దీంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈనెల 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నారు.  

 ఏడాదిలో నిర్మిస్తామని.. పదేండ్లు సాగదీత 

 2014 సెప్టెంబర్​9న కాళోజీ జయంతి సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్​కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ.50 కోట్లతో ఏడాదిలో కళాక్షేత్రం పనులు పూర్తి చేస్తామని, తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. తీరా నిర్మాణం మొదలుపెట్టగా.. మూడు నెలలు నడుస్తూ.. ఆరు నెలలు ఆగుతూ సాగాయి. 2023 వరకు కూడా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారు.  మరోవైపు నిర్మాణంలోని భవనం పిల్లర్లు కుంగాయి. ఎన్ఐటీ సివిల్​ఇంజినీర్ల టీమ్ పరిశీలించి వర్క్స్​క్వాలిటీ లేవని రిపోర్ట్​ఇచ్చింది. కళాక్షేత్రానికి ప్రధానంగా నిలిచే నాలుగు పిల్లర్లకు రెట్రో ఫిట్టింగ్​చేయాలని సూచించింది.


 దీంతో రూ.50 కోట్ల వ్యయం కాస్త రూ.75 కోట్లకు చేరింది. అయినా పనులు కంప్లీట్ కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం  వచ్చిన వెంటనే సీఎం రేవంత్​రెడ్డి సీరియస్‎గా తీసుకున్నారు. సెప్టెంబర్​9 నాటికి పనులు పూర్తి చేయాలని డెడ్​లైన్​పెట్టారు. పెండింగ్‎లో ఉన్న రూ.40 కోట్లను​రాష్ట్ర  జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి విడుదల చేయించారు. దీంతో మొత్తం వ్యయం రూ.90 కోట్లకు చేరింది. ఈనెల 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్​చేసింది. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రారంభించనుండగా ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. 

రాజ్​మహల్ తరహాలో నిర్మాణం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లోని రవీంద్రభారతికి ధీటుగా ఓరుగల్లులో జైపూర్ సిటీలోని రాజ్​మహల్​తరహాలో నిర్మించిన కళాక్షేత్రం ఆకట్టుకుంటోంది. కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాలను చూసేందుకు రెండు అంతస్తుల్లో సీటింగ్​కెపాసిటీ కల్పించారు. ప్రధాన స్టేజీకి ముందు మొదటి అంతస్తులో 22 వరుసలు, రెండో అంతస్తులో మరో 7 వరుసల కుర్చీల్లో కూర్చుంటే స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దారు. 60 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడవుతో  2,400 చదరపు అడుగులతో భారీ స్టేజీకి ఉడెన్ ఫ్లోరింగ్​నిర్మించారు. 


అడ్వాన్స్డ్ ​లైటింగ్, సెంట్రల్ ఏసీ కల్పించారు. ఒక్కో ఫ్లోర్‎లో గ్రానైట్, మార్బుల్స్​వాడటంతో  విద్యుద్దీపాల కాంతుల్లో వెలిగిపోతోంది. దీని ముందే  10 అడుగుల కాళోజీ విగ్రహం ఏర్పాటు చేశారు. కళాక్షేత్రానికి ముందు తామరపూల ఆకారంలో వాటర్​ ఫౌంటెన్లు, గార్డెన్‏తో తీర్చిద్దారు. హనుమకొండ బస్టాండ్​మెయిన్​రోడ్​వైపు ఎంట్రీ, ఎగ్జిట్‌తో 2 మెయిన్​గేట్లు పెట్టారు. ఎడమవైపు శ్రీనివాస్​నగర్​ సైడ్ మరో ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు చేశారు.  

 కళాక్షేత్రం ప్రత్యేకతలు

  • నాలుగున్నర ఎకరాల్లో 4 అంతస్తుల్లో భవనం
  • రెండు అంతస్తుల్లో 1,160 మందికి  సీటింగ్ ​కెపాసిటీ
  • 2,990 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆడిటోరియం 
  • 2,400 అడుగుల భారీ స్జేజీ.. డిజిటల్ ​సౌండ్​ సిస్టమ్
  • భవనం ముందు కాళోజీ విగ్రహం.. చుట్టూ వాటర్​ ఫౌంటెన్లు 
  • 3 మెయిన్​ గేట్లు..100 కార్లు పట్టేలా పార్కింగ్​ సౌకర్యం