కమల వర్సెస్ ట్రంప్.. డిబేట్‎పై పోల్స్‎లో అమెరికన్లు ఎవరివైపు మొగ్గు చూపారంటే..?

కమల వర్సెస్ ట్రంప్.. డిబేట్‎పై పోల్స్‎లో అమెరికన్లు ఎవరివైపు మొగ్గు చూపారంటే..?

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంగళవారం రాత్రి డెమోక్రటిక్​అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ ​క్యాండిడేట్​ డొనాల్డ్​ ట్రంప్​ మధ్య డిబేట్​ వాడీవేడిగా జరిగింది. ఈ డిబేట్‎పై నిర్వహించిన పోల్స్‏లో జనం కమలా హారిస్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆమె ట్రంప్​కంటే 23 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. డిబేట్‏ను మొత్తం 57.75 మిలియన్ల(5 కోట్లకు పైగా) మంది వీక్షించారు. వీరిలో ఎక్కువ మంది ట్రంప్ కంటే కమలా హారిస్ బెటర్​అని అభిప్రాయపడ్డారు.

ఈ డిబేట్‎లో హారిస్​గెలిచారని 57 శాతం మంది వెల్లడించగా, కేవలం 34 శాతం మంది మాత్రమే ట్రంప్‎కు మద్దతు తెలిపారు. కాగా, కమలతో డిబేట్ తర్వాత తానే గెలిచానని ట్రంప్ ప్రకటించారు. వివిధ సర్వేల్లో తనకు 98, 86, 77 శాతం మంది మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కానీ కమలనే పైచేయి సాధించినట్టుగా ఓవరాల్ పోల్ డేటాలో తేలింది. మరోవైపు న్యూట్రల్ ఓటర్లలో కొంతమంది కమలకు, మరికొంత మంది ట్రంప్‎కు మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడైంది. 

మరో చర్చకు సిద్ధంగా లేను: ట్రంప్

కమలా హారిస్‎తో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆమెతో జరిగిన మొదటి డిబేట్‎లో తానే గెలిచానని, కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయని అన్నారు. గురువారం అరిజోనాలో ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏబీసీ జర్నలిస్టులు డిబేట్‏ను పారదర్శకంగా నిర్వహించలేదని, కమలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘‘డెమోక్రటిక్ రాడికల్ లెఫ్ట్ క్యాండిడేట్ కామ్రేడ్ కమలా హారిస్ పై డిబేట్ లో నేను విజయం సాధించినట్టుగా పోల్స్‎లో క్లియర్‎గా వెల్లడైంది. ఆమె వెంటనే రెండో డిబేట్‎కు సిద్ధమని ప్రకటించారు. కానీ అది అవసరమని నేను అనుకోవడం లేదు. మేం ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు. అన్నింటిపైనా చర్చించాం” అని ట్రంప్ పేర్కొన్నారు.