వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..
  • టెన్త్​, ఇంటర్​ స్టూడెంట్స్​పై కలెక్టర్​ స్పెషల్​ ఫోకస్​
  • వెనుకబడిన విద్యార్థుల​పై ప్రత్యేక శ్రద్ధ

కామారెడ్డి, వెలుగు : టెన్త్​, ఇంటర్​లో వంద శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో  సమావేశాలు నిర్వహించి విద్యార్థులు రెగ్యులర్​గా హాజరయ్యే లా చూడాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. 

ప్రభుత్వ స్కూల్స్​, రెసిడెన్షియల్ పాఠశాలలను విజిట్​ చేస్తూ  విద్యార్థులతో మమేకమై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.  తరగతి గదుల్లోకి వెళ్లి  మ్యాథ్స్​, సైన్స్​ , ఇంగ్లిష్ సబ్జెక్టులపై ప్రశ్నలు వేస్తూ విద్యార్థులతో బోర్డులపై జవాబులు రాయిస్తున్నారు. టెన్త్​, ఇంటర్ తర్వాత ఏం చదవాలనే అంశాలను తెలుపుతూ విద్యార్థుల్లో ఆసక్తిని నెలకొల్పుతున్నారు. 

సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి..

సర్కారు బడులపై కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది టెన్త్​ పరీక్షలకు 12,579 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో  జడ్పీ, గవర్నమెంట్ హైస్కూల్స్​ 187 ఉండగా 6,910 మంది విద్యార్థులు,  కేజీబీవీలు 19 ఉండగా 783 మంది,   రెసిడెన్షియల్​ స్కూల్స్​ 36 ఉండగా 2,366 మంది విద్యార్థులు ఉన్నారు.  ప్రైవేట్ పాఠశాలల్లో 2,488 మంది విద్యార్థులు ఉన్నారు.  అన్ని రకాల గవర్నమెంట్​ విద్యా సంస్థల్లో 10,0‌‌‌‌91 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.

ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని గతంలోనే కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు.  ముఖ్యంగా ఇంగ్లిష్​, మ్యాథ్స్, సైన్స్​లో వెనుక బడిన స్టూడెంట్స్​పై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీచర్లకు సూచించారు. దీంతో వేకువజాము నుంచే విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీస్తున్నారు. ఎంఈవోలు, హెచ్​ఎంలతో రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తూ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.  టెన్త్ తర్వాత సంబంధించిన కోర్సులు,  ఐఐఐటీల్లో ప్రవేశాలను వివరిస్తున్నారు.    

ఇంటర్​లోనూ ..

ఈ నెల 5 నుంచి ఇంటర్​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.   ప్రైవేట్​, ప్రభుత్వ కాలేజీల్లో కలిపి మొత్తం 18,469 మంది స్టూడెంట్స్​ పరీక్షలు రాయనున్నారు.  ఇందులో ప్రథమ సంవత్సరంలో  8,743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,726 మంది ఉన్నారు.  ప్రభుత్వ కళాశాలలు 19 ఉండగా,  ప్రథమ సంవత్సరం జనరల్​ కోర్సుల్లో  2,144 మంది, ఒకేషనల్​లో  376, ద్వితీయ  సంవత్సరం జనరల్ 2,129 , ఒకేషనల్​లో 263 మంది విద్యార్థులు ఉన్నారు.  గత ఏడాది  ఫలితాలు తక్కువగా రావడంతో ఈసారి మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు
 తీసుకుంటున్నారు.   

జేఈఈ,  నీట్ పరీక్ష కోసం .. 

గవర్నమెంట్ కాలేజీల్లో  ఎంపీసీ, బీపీసీ చదువుతున్న స్టూడెంట్స్​ జేఈఈ, నీట్ పరీక్షలు రాసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మెటీరియల్ ఇప్పించటంతో పాటు,  లెక్చరర్లతో స్పెషల్​ క్లాస్​లు చెప్పించారు.   ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్​ 
సూచించారు. 

ఇంటర్​ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి టౌన్​, వెలుగు : ఇంటర్​ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్​లో చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్​మెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్​ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. 

38 సెంటర్లలో 18,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని, కరెంట్​ అంతరాయం లేకుండా చూడాలన్నారు.  సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించాలన్నారు.   సమావేశంలో అడిషనల్ కలెక్టర్​ విక్టర్, ఇంటర్​ నోడల్​ అధికారి షేక్​సలాం తదితరులు పాల్గొన్నారు.