కామారెడ్డిపై పోలీస్​శాఖ శీతకన్ను!

కామారెడ్డిపై పోలీస్​శాఖ శీతకన్ను!
  • సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ జిల్లాల కూడలిగా కామారెడ్డి
  • కాలనీల ఏర్పాటుతో విస్తరిస్తోన్న జిల్లా కేంద్రం
  • పెరిగిన క్రైమ్ రేట్​
  • నియంత్రణకు పోలీసులు అవస్థలు
  • ప్రతిపాదనలోనే ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రం విస్తరిస్తోంది.  టౌన్​ నుంచి జిల్లా కేంద్రంగా మారి సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్​ జిల్లాలకు కామారెడ్డి కూడలిగా మారింది.  వ్యాపారం, విద్యతోపాటు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.   దీంతో ఇక్కడికి వచ్చి నివసించే వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఇలా రోజు రోజుకు టౌన్​ విస్తరిస్తున్నప్పటికీ  శాంతిభద్రతల పరిరక్షణకు  తగినంత పోలీసు యంత్రాంగం లేదు.  2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్​ పరిధిలో 1,04,267 జనాభా ఉంది.  49 వార్డులు ఉన్నాయి.

  నాటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఒక పోలీస్​స్టేషన్​ మాత్రమే ఉంది.  జిల్లా కేంద్రంగా మారడంతోపాటు,  పెరిగిన జనాభాకు అనుగుణంగా మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావాల్సి ఉన్నా చర్యలు చేపట్టలేదు. దీనికి ట్రాఫిక్​ రద్దీపెరిగింది. ట్రాఫిక్​పోలీస్​స్టేషన్, మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా పోలీస్​స్టేషన్​ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

పెరిగిన క్రైమ్​ రేట్​

జిల్లా కేంద్రం నడిబొడ్డు నుంచి  నలువైపుల నాలుగైదు కిలో మీటర్ల వరకు విస్తరించింది.   కాలనీలు పెరిగాయి.  క్రైమ్​ రేట్​కూడా పెరిగింది.  చోరీలు, ఆత్మహత్యలు,  మహిళలపై వేధింపులు, యాక్సిడెంట్ కేసులు పెరిగాయి.  హైవే, రైల్వే లైన్​ఉండటంతో  ప్రజల రాకపోకలు పెరుగుతున్నాయి.

 జిల్లా కేంద్రానికి వీఐపీల తాకిడి ఎక్కువే.  నేర పరిశోధనలు,  నేరాలు జరగకుండా పెట్రోలింగ్, వీఐపీల బందోబస్తు,  ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు
జరుగుతుంటాయి.  వీటన్నింటిని ప్రస్తుతం ఉన్న టౌన్​ పోలీస్​ స్టేషన్​ పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది.  ఇక్కడ మరో పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.   టౌన్ లో మరో పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. 

అస్తవ్యస్తంగా ట్రాఫిక్​

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​ లేదు.   ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్​ ఐదుగురుని ట్రాఫిక్​ డ్యూటీకి కేటాయించారు. వీరు  చలాన్లు వేయటానికి మాత్రమే పరిమితమవుతున్నారు.   మెయిన్​రోడ్లు, ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ.   స్థానికులతోపాటు,  వివిధ అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు.  దీంతో వందలాది వెహికల్స్​ రాకపోకలు ఎక్కువయ్యాయి.     చౌరస్తాల్లో ఎవరు ఎటు నుంచి వస్తున్నారో తెలియడంలేదు. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.   కొన్ని సార్లు ట్రాఫిక్​ జామ్​ అవుతోంది.

  కొత్త బస్టాండ్​, నిజాంసాగర్​ చౌరస్తా,  ఇందిరాచౌక్, పాత బస్టాండ్,  రామారెడ్డి రోడ్డు చౌరస్తా,  సుభాష్​ రోడ్డు చౌరస్తా, జేపీఎన్​ రోడ్డు చౌరస్తాల్లో ట్రాఫిక్​ అస్తవ్యస్తంగా ఉంది.  టౌన్​లో ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కాగితాల్లో నే ఉంది.  ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటుకు నాలుగేళ్ల  క్రితం ప్రతిపాదనలు పంపారు.  గత సీఎం కేసీఆర్​ ఇక్కడకు వచ్చినప్పుడు ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు  చేయాలని నాటి  పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. అయినా ఏర్పాటు కాలేదు.  ప్రస్తుతం పెరిగినా జనాభా, అవసరాల దృష్ట్యా టౌన్​లో మరో పోలీస్​ స్టేషన్ తో పాటు, ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.