
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై బుధవారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా 69 చోట్ల తనిఖీలు చేపట్టి 16 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అనుమానం ఉన్న ఆఫీసులు, ఇండ్లలో తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి డివిజన్లో 42 చోట్ల తనిఖీలు చేసి 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఎల్లారెడ్డి డివిజన్లో 12 చోట్ల తనిఖీలు చేయగా, 5 కేసులు, బాన్సువాడ డివిజన్లో15 చోట్ల తనిఖీలు చేయగా, 3 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. అధిక వడ్డీల వసూళ్ల వల్ల అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జిల్లావ్యాప్తంగా ఫిర్యాదు రాగా, దాడులు నిర్వహించామని ఎస్పీ పేర్కొన్నారు.
లింగంపేటలో పోలీసుల సోదాలు డాక్యుమెంట్లు, నగదు సీజ్
లింగంపేట, వెలుగు : మండల కేంద్రంలోని పలువురు ఫైనాన్స్ యజమానుల ఇండ్లల్లో బుధవారం ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ ఆధ్వర్యంలోన సోదాలు నిర్వహించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసి డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు లింగంపేటకు చెందిన జక్కనిబాబా, కౌడరవి, పారిపల్లి సంతోష్ ఇండ్లలో సోదాలు చేశామన్నారు. వీరి ఇండ్లలో వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన ఎలాంటి డాక్యు మెంట్లు దొరకలేదని చెప్పారు.
అనంతరం కొత్త సంతోష్ దుకాణంలో సోదాలు నిర్వహించగా నాలుగు డాక్యుమెంట్లు, బంగారం తనఖా పెట్టుకున్న ఒక డాక్యుమెంట్, రూ.90 వేల నగదు లభించినట్లు చెప్పారు. డాక్యుమెంట్లు, నగదును సీజ్ చేసినట్లు వివరించారు. కొత్త సంతోష్పై మనీ లెండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. సోదాల్లో ఇన్చార్జి ఎస్సై ప్రకాశ్నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.