
- ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
- కామారెడ్డి రైల్వే స్టేషన్ లో పనుల పరిశీలన
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి రైల్వే స్టేషన్లో రూ. 39 కోట్లతో చేపడుతున్న ఆధునీకీకరణ పనులు 6 నెలల్లో పూర్తవుతాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను వారు పరిశీలించి, రైల్వే అధికారులతో మాట్లాడారు. స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్ వెడల్పు చేయనున్న దృష్ట్యా ఇరువైపులా ఉన్న కొన్ని షాపులను తొలగించాల్సి ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా భవిష్యత్లో రైల్వే అధికారులు నిర్మించే కాంప్లెక్స్లో షాపుల కేటాయింపునకు ప్రయార్టీ ఇవ్వాలన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్, లిప్టు సౌకర్యంతో పాటు, ఫ్లాట్ ఫారాల ఆధునీకీకరణ, రెస్టు రూమ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. కలెక్టరేట్, పాత రాజంపేట సమీపంలో ఆర్వోబీ, ఆర్యూబీ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ విక్టర్, రైల్వే ఇంజినీరింగ్ అధికారి ఆశిష్, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్, మండల ప్రెసిడెంట్లు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.