
సిద్దిపేట రూరల్, వెలుగు: అకారణంగా తొలగించిన ప్రభుత్వ హాస్పిటల్ ఔట్సోర్సింగ్స్టాఫ్ నర్స్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఔట్సోర్సింగ్నర్సులతో కలిసి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 కరోనా సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఔట్సోర్సింగ్ పద్దతిలో 80 మంది నర్సులను రిక్రూట్మెంట్ చేసిందని, అప్పుడు వీరిని పర్మనెంట్ చేస్తామని హామీతో తీసుకున్నారని పేర్కొన్నారు. వీరిని రెగ్యులరైజ్ చేయకపోగా విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్డర్ కాపీ ఇవ్వకుండా వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామంటూ ఫోన్లకి మెస్సేజ్లు పంపడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వీరిని విధుల్లోకి తీసుకొని ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, స్టాఫ్ నర్స్ సిబ్బంది సంపత్, తార, గీత, శ్వేత పాల్గొన్నారు.