కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లో..కీలకంగా ‘కానుకుర్తి’

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లో..కీలకంగా ‘కానుకుర్తి’
  • ఇక్కడ్నుంచే రెండో దశ రిజర్వాయర్లకు నీటి పంపింగ్
  • రిజర్వాయర్ కెపాసిటీ ఒకటిన్న ర టీఎంసీలకు పెంపు  
  • రూ.4,350 కోట్లకు పెరిగిన నిర్మాణ అంచనా వ్యయం
  • రాష్ట్ర సర్కార్ నుంచి అనుమతులు రాగానే పనులు షురూ

మహబూబ్​నగర్​, వెలుగు : ‘నారాయణపేట– -కొడంగల్–​- మక్తల్’ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లో కానుకుర్తి రిజర్వాయర్​కీలకం కానుంది. లిఫ్ట్ స్కీమ్ ను రెండు దశల్లో నిర్మించనుండగా.. రెండో దశలోని ఆరు రిజర్వాయర్ల ఫుల్​కెపాసిటీ వరకు నీటిని తరలించేందుకు కానుకుర్తి రిజర్వాయర్ కెపాసిటీని పెంచేందుకు ఇరిగేషన్​శాఖ నిర్ణయించింది. ఇందుకు ప్రపోజల్స్​రెడీ చేసి రాష్ర్ట ప్రభుత్వానికి అందజేసింది. అనుమతులు రాగానే పనులను షురూ చేస్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే  కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చేపట్టింది. దీనికి గత ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.  స్కీమ్ కింద మొత్తం10 రిజర్వాయర్లు నిర్మిస్తారు.  ఇందుకు రూ.3,083 కోట్ల నిధులతో అంచనా రూపొందించారు. ఇప్పటికే టెండర్ల దశ పూర్తి కాగా.. రెండు దశల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తారు. 

1.5 టీఎంసీలకు పెంపు

మొదటి దశలో ఊట్కూరు, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి చెరువులను,   రెండో దశలో లక్ష్మీపూర్, దౌల్తాబాద్, ఈర్లపల్లి, హస్నాబాద్, కొడంగల్, బొంరాస్​పేట చెరువులను రిజర్వాయర్లుగా నిర్మిస్తారు. ఒక్కోదాంట్లో ఒక టీఎంసీ నుంచి ఒకటిన్న ర టీఎంసీ కెపాసిటీతో నీటిని నింపేందుకు ప్లాన్​చేశారు. అయితే ముంపు సమస్య.. రెండో దశలోని రిజర్వాయర్లను నింపేందుకు ప్రాబ్లమ్స్ ఎదురయ్యే చాన్స్​ఉన్నట్లు ఇరిగేషన్​శాఖ గుర్తించింది.

దీంతో అధికారులు ప్లాన్​లో మార్పులు చేశారు.  అన్నింటి కెపాసిటీ పెంచకుండా మొదటి దశలోని చివరి రిజర్వాయర్​అయిన కానుకుర్తి చెరువు కెపాసిటీని మాత్రమే పెంచేందుకు నిర్ణయించారు.  రెండో దశలోని చెరువుల కంటే ఇది ఎత్తులో ఉంటుంది.  ముందుగా దీని కెపాసిటీని పెంచి.. గ్రావిటి కెనాల్స్​ద్వారా రెండో దశలోని చివరి రిజర్వాయర్​వరకు ఈజీగా నీటిని తీసుకెళ్లేందుకు చాన్స్ ఉంటుందనే అంచనాకు వచ్చారు. దీంతో ఇదే ప్లాన్​ను ఇటీవల ముఖ్యమంత్రి సీఎం రేవంత్​రెడ్డి ముందు పెట్టారు.  
 

రింగ్ బండ్స్​ ఏర్పాటు

కానుకుర్తి రిజర్వాయర్​కెపాసిటీని పెంచే క్రమంలో ముంపు సమస్యకు చెక్​పెట్టేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. రిజర్వాయర్​ను ఎత్తులో నిర్మించడంతో పాటు ఒకటిన్నర టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చెరువును పది మీటర్ల లోతుకు తవ్వనున్నారు. రిజర్వాయర్​పటిష్టంగా ఉండేందుకు రింగ్​బండ్స్​ను కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు, లీకేజీలు కాకుండా కట్టుదిట్టంగా నిర్మించేలా డిజైన్​రూపొందిస్తున్నారు. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి ఇరిగేషన్​ ఆఫీసర్లతో చర్చించారు. 

అదనంగా రూ.1,267 కోట్లకు పెంపు 

తక్కువ భూ సేకరణతో పనులు పూర్తి చేసి మొదటి దశలోని రిజర్వాయర్లకు నీటిని తరలించేం దుకు ప్రెషర్​ మెయిన్స్​ (పైప్​లైన్​) ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకు అదనంగా రూ.500 కోట్ల అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం కానుకుర్తి రిజర్వాయర్​ ఎత్తు పెంచడంతో పాటు కట్టలు ఏర్పాటు చేయాల్సి వస్తుండటంతో మరో రూ.767 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేయగా.. ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగింది.  దీంతో రూ.3,083 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు పెరిగింది.