ప్రజాస్వామ్యంపై దాడే..నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తు నోటీసులపై కపిల్ సిబల్

ప్రజాస్వామ్యంపై దాడే..నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తు నోటీసులపై కపిల్ సిబల్

న్యూఢిల్లీ:  కాంగ్రెస్​ పార్టీ కోలుకోకుండా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కుట్రలు చేస్తోందని రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ సీనియర్​ నేత కపిల్​ సిబల్ ఆరోపించారు. ఇందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందన్నారు. నేషనల్​ హెరాల్డ్​కు సంబంధించి మనీలాండరింగ్​ కేసులో స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ ఇచ్చిన నోటీసులు ముమ్మాటికీ  ప్రజాస్వామ్యంపై దాడేనని  పేర్కొన్నారు.

ఈమేరకు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ వార్తా పత్రికకు సంబంధించిన భవనాల్లో కాంగ్రెస్‌‌‌‌ కార్యాలయాలు నడుస్తున్నాయని కపిల్​ సిబల్ గుర్తుచేశారు. వాటిని మూసివేయించాలనే ఉద్దేశంతోనే ఆయా కార్యాలయాలకు ఈడీతో నోటీసులు పంపించారని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఎందుకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  

బీజేపీ.. నియంతృత్వానికి తండ్రి

ప్రజాస్వామ్యానికి బీజేపీ తల్లివంటిదని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.. నిజానికి ఆ పార్టీ నియంతృత్వానికి తండ్రివంటిదని సిబల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ–ముస్లిం ఎజెండాపై 
రాజకీయాలు చేయాలని చూస్తూ, ప్రతిపక్షాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.