
కరీంనగర్ టౌన్, వెలుగు: యాసంగిలో వడ్ల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కొనుగోళ్ల కమిటీ సభ్యులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వడ్లు పూర్తిగా పక్వతకు వచ్చిన తర్వాతనే కోతలు కోసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలన్నారు.
వరి కోతలకు సంబంధించి రెవెన్యూ గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలన్నారు. తూకపు యంత్రాలు, తేమను కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల,వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో తహసీల్దార్లు వరి కోత మిషన్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి కోతల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు.
ఏవోలు, ఏఈవోలు ప్రణాళిక ప్రకారం పంట కోతలు జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. మీటింగ్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, సివిల్ సప్లై ఆఫీసర్ వసంత లక్ష్మి, డీటీవో లక్ష్మణ్, మార్కెటింగ్ శాఖ డీఎం ప్రకాశ్ పాల్గొన్నారు.