
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని తద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆధునీకరించిన ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు ప్రపంచ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన పిచ్చుకగూళ్ల ఎగ్జిబిషన్, పోస్టర్ తయారీ, చిత్రలేఖనం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు, ఏవో సుధాకర్, సెక్టోరల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.టీబీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో సిటీలోని మొహతాజ్ ఖానాలోని పీహెచ్సీలో టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో టీబీని గుర్తించి మందులు వాడితే నయమవుతుందన్నారు. డీఎంహెచ్వో డా.వెంకటరమణ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.సాజిద, తదితరులు పాల్గొన్నారు.