
- పనుల నిలిపివేతపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు లెటర్
- నష్టంతో పాటు డీ, రీమొబిలైజేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్
- ఎన్జీటీ ఆదేశాలతో గతేడాది సెప్టెంబర్లో ఆగిన పనులు
- ప్రొటెక్షన్ వాల్కు ఈసీ క్లియరెన్స్ అవసరం లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫిడవిట్
కరీంనగర్, వెలుగు : మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ సరికొత్త మెలిక పెట్టింది. ఎన్జీటీ ఆదేశాల కారణంగా ఏడు నెలల కింద పనులు ఆగిపోవడంతో జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భరించాలంటూ రాసిన లెటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు వరదల నుంచి రక్షణ కల్పించేందుకే మానేరుకు ఇరువైపులా సేఫ్టీవాల్స్ నిర్మిస్తున్నామని, ఈ పనులకు టూరిజం శాఖ పనులతో సంబంధం లేదని, వాల్స్ నిర్మాణానికి ఈసీ పర్మిషన్ అవసరం లేదంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఎన్జీటీ తుది తీర్పుపై మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఆధారపడి ఉన్నాయి.
సెప్టెంబర్లో నిలిచిన పనులు
ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టిదంటూ ఓ వ్యక్తి 2023 ఆగస్టులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ క్లియరెన్స్ లేనిదే పనులు చేయొద్దని గతేడాది సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇరిగేషన్ శాఖను కూడా ప్రతివాదిగా చేర్చారు. దీంతో పనులు నిలిపివేయాలంటూ ఇరిగేషన్ ఎస్ఈ ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ కంపెనీ ఎస్ఎల్ఆర్ హెచ్ఈఎస్ (జేవీ)కి లేఖ రాశారు.
నష్టం ప్రభుత్వమే భరించాలంటూ రిప్లై
పనులు నిలిపివేయాలని ఇరిగేషన్ ఎస్ఈ రాసిన లెటర్కు కంపెనీ తాజాగా రిప్లై ఇచ్చింది. మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పనులు ఆపితే ప్రొటెక్షన్ వాల్, చెక్డ్యాం, బండ్ వంటి నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ నష్టానికి తాము బాధ్యత వహించబోమంటూ లేఖలో స్పష్టం చేసింది. అలాగే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వద్ద వర్కర్స్, మెటీరియల్, మెషినరీ సిద్ధంగా ఉన్నాయని, పనులు ఆగిపోతే ఇవన్నీ వృథా అవుతాయని పేర్కొన్నారు.
మెటీరియల్ పాడైనా, ఎక్స్పైరీ అయినా దీనికి సంబంధించిన ఖర్చులన్నీ ఇరిగేషన్ శాఖే చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించాలంటే డీమొబిలైజేషన్, రీమొబిలైజేషన్ ఖర్చులు ఉంటాయని వీటితో పాటు, పనులు జరిగే చోట నిలిచిన నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అయ్యే ఖర్చులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎన్జీటీ, పర్యావరణ ప్రభావ అధ్యయనాలను పూర్తి చేసి త్వరగా అవసరమైన అనుమతులు పొంది, భూ సేకరణ పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రొటెక్షన్ వాల్ పనులకు ఈసీ అవసరం లేదు : ఎన్జీటీలో ఇరిగేషన్ శాఖ అఫిడవిట్
ఎల్ఎండీ దిగువన మానేరు నదిలో 1.100 కిలోమీటర్ నుంచి 3.700 కిలోమీటర్ వరకు రూ. 310.464 కోట్లతో ఇరువైపులా ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. వీటికి, టూరిజం పనులకు అసలు సంబంధం లేదని ఇరిగేషన్ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ నెల 3న అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక్కడ కొత్తగా నీటిని నిల్వ చేయడం లేదని, ప్రొటెక్షన్వాల్ కేవలం వరదల నివారణ, నీటి నాణ్యత మెరుగుదల, నదీ పరిసరాల పునరుద్ధరణ కోసమేనని స్పష్టం చేసింది. 2015 నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న పనులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని వెల్లడించింది. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పూర్తిగా టూరిజం శాఖ చేపట్టిందేనని, ఈ ప్రాజెక్ట్కు ఇరిగేషన్ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
పర్యావరణ నిబంధనలకు లోబడే రివర్ ఫ్రంట్
రివర్ బెడ్లో సుమారు 3 గుంటల్లో మాత్రమే మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్మించాలన్న ప్రపోజల్ ఉందని, రూల్స్ ప్రకారం దీనికి పర్యావరణ అనుమతులు అక్కర్లేదని మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ రీజినల్ డైరెక్టర్కు టూరిజం శాఖ మార్చిలో లేఖ రాసింది. భవిష్యత్లో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ ప్రాంతం 50 హెక్టార్లకు మించితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందేందుకు తప్పకుండా పర్యావరణ ప్రభావ అధ్యయనం నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చే తుది తీర్పును అనుసరించి మానేరు రివర్ ఫ్రంట్ భవితవ్యం తేలనుంది.