
- పాత స్టేషన్ల అప్గ్రేడ్కు ప్రతిపాదనలు
- క్రైమ్ రేట్ను తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కసరత్తు
- కొత్త స్టేషన్ల రాకతో తగ్గనున్న పనిభారం
జగిత్యాల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ రేట్ నియంత్రణకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు పోలీస్ సేవల విస్తరణకు కొత్తగా పోలీస్ స్టేషన్లు, ఉన్నవాటిని అప్గ్రేడ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో పోలీస్స్టేషన్ల ఏర్పాటుతోపాటు, క్రైమ్రేట్ ఎక్కువగా చోట్ల కొత్తగా పీఎస్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రపోజల్స్ సిద్ధం చేసి సర్కార్కు అందజేశారు.
15 పీఎస్ల అప్గ్రేడ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో15 పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసేందుకు అధికారులు ప్రపోజల్స్ పంపించారు. జనాభా ఆధారంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు లో ఉండేలా అప్ గ్రేడ్ చేయనున్నారు. జగిత్యాల టౌన్, రాయికల్, ధర్మపురి, జగిత్యాల రూరల్, మల్యాల, మెట్పల్లి, కోరుట్ల, పెద్దపల్లి, ఎన్టీపీసీ, కరీంనగర్ వన్ టౌన్, మానకొండూరు, ఎల్ఎండీ, ఇల్లంతకుంట, వేములవాడ, తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లు అప్ గ్రేడ్ కానున్నాయి. అక్కడ కొత్తగా ఎస్హెచ్వోల స్థాయి పెంపుతోపాటు సిబ్బంది సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది.
దీనిద్వారా పెండింగ్ కేసుల దర్యాప్తు స్పీడందుకోనుంది. దీంతోపాటు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నిఘా పెరగనుంది. కాగా ఇటీవల కొత్తగా జాయిన్ అయిన ఎస్సైలు, పీసీల్లో కొంతమందిని కమిషనరేట్, ఎస్పీ ఆఫీసుల్లో సర్దుబాటు చేశారు. వీరిని కొత్తగా ఏర్పాటు చేసే పీఎస్ల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అర్హత ఉండి ఒకే క్యాడర్ లో సేవలందిస్తున్న ఆఫీసర్లకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉందన్న ప్రచారం నడుస్తోంది.
కొత్త మండలాల్లో పోలీస్స్టేషన్లు
జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు భీమారం, ఎండపల్లిలో, సిరిసిల్ల టౌన్లో మరొకటి, వేములవాడలో ట్రాఫిక్ సమస్య కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. మహిళల కోసం గోదావరిఖనిలో ఉమెన్ పోలీస్ స్టేషన్, సిరిసిల్ల ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రపోజల్స్ రూపొందించారు. జగిత్యాలలోనూ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ తాత్కాలికంగా వాయిదా పడింది.