
- వివిధ కారణాలతో కరీంనగర్–జగిత్యాల రూట్లో రూ.270 కోట్ల మేర పెంపు
- కొత్త టెండర్ నోటిఫికేషన్
- స్పీడ్ గా కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారి పనులు
- శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద టోల్ గేట్ నిర్మాణం
- పూర్తి కావొస్తున్న ఫ్లై ఓవర్ల నిర్మాణం
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ మీదుగా వరంగల్ నగరాన్ని కనెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న 563 నేషనల్ హైవే అంచనా వ్యయం పెరిగినట్లు తెలిసింది. కరీంనగర్– జగిత్యాల సెక్షన్లో నిర్మాణ అంచనా వ్యయం రూ.1503 కోట్లు ఉండగా.. తాజాగా రూ.1782 కోట్లకు పెరిగినట్లు సమాచారం. నిర్మాణరంగానికి సంబంధించిన సామగ్రి ధరలు పెరగడంతోనే అంచనాలను రివైజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ అంచనాలకు తోడు జీఎస్టీ, భూసేకరణకు వెచ్చించిన నిధులు కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,230 కోట్ల వరకు చేరింది. కరీంనగర్ సిటీ శివారు కొతపల్లి పట్టణ సమీపంలో బైపాస్ ద్వారా జగిత్యాల వరకు ఫోర్ లేన్గా 58.86 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు. ఈ ఫోర్ లేన్ కోసం 241 హెక్టార్ల భూమిని సేకరించేందుకు సుమారు రూ.387 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
స్పీడ్ గా పనులు
కరీనగర్–వరంగల్ హైవే పనులు స్పీడ్గా సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ను, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను కలిపే ఈ హైవేను రూ.2146 కోట్ల అంచనా వ్యయంతో కరీంనగర్ జిల్లా పరిధిలో 46.24 కి.మీ, హనుమకొండ జిల్లా పరిధిలో 21.77 కి.మీ కలిపి 68 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16 వరకు పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కరీంనగర్– వరంగల్ మధ్య మొత్తం 30 గ్రామాలను కవర్ చేస్తుండగా.. మానకొండూర్, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తిలాంటి ప్రధాన మండల కేంద్రాలు తగలకుండా బైపాస్ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ఈ పనులు సుమారు 70 శాతం మేర పూర్తికావొచ్చాయి.
కొత్తగట్టు వద్ద టోల్ గేట్
హైవే పూర్తయితే కరీంనగర్–వరంగల్ మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు టోల్ చార్జీల బాదుడు మొదలుకానుంది. శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం సమీపంలో టోల్ గేట్ ను నిర్మిస్తున్నారు. టోల్ గేట్ ప్రారంభమైతే ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు చార్జీ కూడా టికెట్పై రూ.10 వరకు పెరగనుంది.