
కరీంనగర్ టౌన్, వెలుగు: రూ.443కోట్ల బడ్జెట్ను ఆమోదించినట్లు కరీంనగర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పమేలాసత్పతి వెల్లడించారు. గురువారం మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బల్దియా ఆదాయ వనరుల మెరుగుపర్చుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, పారిశుద్ద్య నిర్వహణ, రుణ వాయిదాల చెల్లింపులకు కేటాయించినట్లు తెలిపారు.
బల్దియా సొంత ఆదాయం, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్, 15 ఫైనాన్స్ నిధుల్లోంచి 10శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించినట్లు తెలిపారు. తప్పనిసరి పద్దుల కేటాయింపులు పోను బల్దియా సొంత నిధుల్లోంచి 33శాతం నిధులను విలీనగ్రామాల ఏరియాలు, బలహీనవర్గాలు, మైనార్టీలు నివసించే ఏరియాల అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు. కమిషనర్ అడిషనల్ కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్ మొహియుద్దీన్, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ యాదగిరి, సంజీవ్, ఏసీపీలు బషీరొద్దీన్, వేణు, పాల్గొన్నారు.
వారధి ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలి
వారధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సకాలంలో చెల్లించాలని సొసైటీ చైర్పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్ వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015లో ప్రారంభమైందని గుర్తు చేశారు. గతంలో జిల్లాలో 49 ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్లు ఉండగా.. ప్రస్తుతం 150కి పెంచనున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీధర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, వారధి సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు, స్త్రీనిధి ఆర్ఎం మధార్, మెప్మా పీడీ వేణుమాధవ్ పాల్గొన్నారు.