
- స్థలం దొరక్క ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పక్కన పెట్టిన బల్దియా
- నిధుల్లో రూ.24 కోట్లు వినియోగించుకోలేని దుస్థితి
- హుజూరాబాద్ వేస్ట్ టూ ఎనర్జీ యూనిట్పైనే ఆశలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటుకు నోచుకోలేదు. కార్పొరేషన్ చుట్టుపక్కల సకాలంలో స్థలం దొరక్కపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మార్చి 31నాటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు పూర్తికావడంతో ఇక మీదట కొత్త టెండర్లు ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఈ యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చేయాలని భావించిన సుమారు రూ.24 కోట్లు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తింది.
బయోమైనింగ్ పూర్తి కాకే సమస్య..
సుమారు నాలుగైదు దశాబ్దాలుగా మానేరు తీరాన గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డును స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.16 కోట్లు వెచ్చించారు. పేరుకుపోయిన సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్తో రీసైక్లింగ్ చేయడం ద్వారా మళ్లీ వినియోగించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన ఓ సంస్థకు పనులు అప్పగించారు.
పనులు దక్కించుకున్న సంస్థ 2022 జూన్ నుంచి చెత్తను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. అగ్రిమెంట్ ప్రకారం డంపింగ్ యార్డును ఏడాదిలో పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వాలి. చెత్తనంతా తొలగిస్తే ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను నెలకొల్పగలిగే స్థలం ఉండేది. కానీ
మూడేళ్లయినా సగం యార్డు కూడా క్లియర్ కాలేదు. వేసవిలోనేగాక వర్షాకాలం, చలికాలంలోనూ డంపింగ్ యార్డు మండుతూనే ఉంది. దాని నుంచి వచ్చే పొగ ఆటోనగర్, కోతిరాంపూర్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వేస్ట్ టూ ఎనర్జీ యూనిట్పైనే ఆశలు
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ సకాలంలో ఏర్పాటు చేయలేకపోవడంతో కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. కొత్తపల్లి పట్టణం కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమయ్యాక.. ప్రస్తుతానికి రోజువారీ చెత్తను మానేరు తీరానికి బదులు కొత్తపల్లి డంపింగ్ యార్డుకే తరలిస్తున్నారు. హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో 25 ఎకరాల్లో వేస్ట్ టూ ఎనర్జీ యూనిట్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతోపాటు కరీంనగర్ నుంచి వెలువడే చెత్తను అక్కడికే తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే డంపింగ్ యార్డు సమస్య తీరుతుందని భావిస్తున్నారు.
సెగ్రిగేషన్ మీదే ఫోకస్ చేస్తున్నాం
డంపింగ్ యార్డు స్థలాల విషయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అందుకే మేం ఎక్కువ సెగ్రిగేషన్ మీదే ఫోకస్ చేస్తున్నాం. సెగ్రిగేట్ అయి వస్తే డంప్ యార్డుతో అవసరం ఉండదు. హౌసింగ్ బోర్డులో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ) నిర్వహిస్తున్నాం. ఇక్కడ వేరుచేసిన కొన్ని రకాల వ్యర్థాలను సిమెంట్ కంపెనీలు వినియోగించుకునే అవకాశముంది. సిమెంట్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. చాహత్ బాజ్ పాయ్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్