తులసి మొక్క దగ్గర దీపం ఉదయం వెలిగించాలా.. సాయంత్రం వెలిగించాలా.

 తులసి మొక్క దగ్గర దీపం ఉదయం వెలిగించాలా.. సాయంత్రం వెలిగించాలా.

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి ( నవంబర్​ 24) . అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. అయితే ఈరోజున (నవంబర్​24)న  సాయంత్రం  తులసిమొక్క దగ్గర దీపం వెలిగించి.. తులసి పూజ చేసి.. తరువాత లో  తులసిమొక్కకు .. ఉసిరి చెట్టుకు వివాహం జరిపిస్తారు.  పుణ్యప్రదమైనది ..  పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే కాబట్గి  క్షీరసాగరాన్ని చిలికారు. చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది.  

కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజునే ( నవంబర్​ 24) దామోదర ద్వాదశి, యోగీస్వరద్వాదశి అని కూడా అంటారు. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి( నవంబర్​ 24)  నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి ( నవంబర్​ 24) నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం.

ఈ రోజున( నవంబర్​ 24)  తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారాన్ని  బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేస్తారు.బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించిన ..  మహోత్కృష్టమైన రోజే  కార్తీక శుద్ధ ద్వాదశి.

ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీని శ్రీలక్ష్మీగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం, ఈరోజు దీపారాధన చేయడంవల్ల పరిహారమౌతుంది. క్షీరాబ్ధి ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి, సాయంత్రం తులసి, ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలనుచేసి సాలగ్రామ, దీపదనములను చేయుటవల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి.

క్షీరాబ్ది ద్వాదశీ మహత్మ్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. భక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక, కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి... ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు. కాళిందీ నదీలో పుణ్యస్నానం చేసి, మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి, మహిమాన్వితమైన ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం పెట్టించి, తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా దూర్వాస మహాముని ఆ ప్రాంతానికి విచ్చేశాడు. దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దుర్వాసుడు తాను కాళిందిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్యబృందంతో సహా వెళాడు.

నదిలో స్నానం చేస్తూ పారవశ్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్లిపోయాడు. ద్వాదశి ఘడియలలో భుజిస్తే గాని వ్రత ఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచలను సాగించాడు. దూర్వాసుడు నా అతిథి. అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి, శాపానికి గురి అవుతాను.  ద్వాదశ ఘడియలలో నేను పారణం చేయకపోతే, వ్రతఫలం దక్కదు, విష్ణువు కృప వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ ఘడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది. అతిథినీ గౌరవించినట్లవుతుంది. ఒకవేళ, అప్పటికీ ఆయన ఆగ్రహించి శపిస్తే, అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి, కేవలం జలాన్ని సేవించి, ముని రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

ఇంతలో నదీస్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిందని మహాపరాధంగా భావించాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై, జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీమహావిష్ణువును శరణు వేడాడు. భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి, దురహంకారియైన దూర్వాసుని వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించడం ఎవరి తరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్ధించగా.. దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని, అయననే శరణువేడటం మంచిదని విధాత సూచించాడు.

దీంతో విష్ణువు చెంతకు చేరి దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి.. నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దూర్వాసుడు... అంబరీషుని వద్దకు వెళ్లి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ధి ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగాగే, దీనికి అంబరీషుడు... ఓ మహర్షీ.. ఈ రోజు జరిగినవన్నీ భగవత్సంకల్పాలేనని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణుసన్నిధికి చేరింది.

అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు.. ఈ రోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది.. క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిథి రోజు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందతారని అనుగ్రహించాడు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు అయిదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల నైవేద్యాలు, అయిదు రకాల పండ్లు, తాంబూలాలను సమర్పించాలి.