కార్తీకపురాణం: కార్తీకంలో హరి అన్నారా.. మీకు దైవ శక్తి వచ్చినట్టే.... ఎలాగంటే...

కార్తీకపురాణం: కార్తీకంలో హరి అన్నారా.. మీకు దైవ శక్తి వచ్చినట్టే.... ఎలాగంటే...

కార్తీకమాసమందు  హరినామము జపిస్తూ .. గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై  వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము నొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు.  అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము .  దీనికి సంబంధిచిన పురాణ కథను వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీకపురాణం 11వ అధ్యాయంలో వివరించెను.  

 ఓ జనక మహారాజా! యీ కార్తీక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు మహా విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును.  విష్ణువును అర్చించిన అనంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము అని వశిష్టులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమా౦సాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాధన మొదలైన  ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగా భావించి  విసుగు చెందకుండా సకల ఉపచారములు  జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను.
మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వ్యాపారము  కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను.

ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచున్నాడు.  ఆ బ్రాహ్మణుడను కొట్టి.  భయపెట్టి  ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను.  సమీపమందున్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకునిపై బడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతుడను  కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకములో అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచు౦డెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ విధంగా వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు.  నేను సదా హరి నామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కావున, నాకు మోక్షమార్గము ప్రసాదించు"మని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసికొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావలయును.

 దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము" అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను  ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత యింటికి వెళ్లుచున్నప్పుడు  తనకు కనిపించిన వారికందరికి  ఆరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకొనిపోయిరి.

కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి  ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ యీ నరక బాధపడుచున్నారు . కావున, నాయ౦దు దయయుంచి వానిని వుద్దరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండి  స్నాన సంధ్యాదులు మాని పాపాత్ము డైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము ... నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము, మద్య మాంసభక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరక బాధలు పడుచున్నారని వారి చరిత్రలు చెప్పిరి.

 అందుల కామె చాల విచారించి  ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురనూ కూడా ఉద్ధరింపుడని ప్రార్ధించగా, అందులకా దూతలు "అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదె ఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. అప్పుడు ఆ నలుగురును ఆమె కడకు వచ్చి...  విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తీక మాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టుల వారు చెప్పినారు. 

ఇది స్కాందపురాణంలోని కార్తీక పురాణంలోని 11 వ అధ్యాయం పారాయణం సంపూర్ణం

 ఏకాదశాధ్యాయము - పదకొండవరోజు పారాయణము సమాప్తము.