
కోల్ బెల్ట్, వెలుగు: పనిభారం మోపుతూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలని మందమర్రి ఏరియా కాసిపేట-–1 బొగ్గు గని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుడు శశికాంత్పనిభారంతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో శుక్రవారం మొదటి షిఫ్టు విధుల సమయంలో మేనేజర్ ఆఫీస్ ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. వీరికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ లీడర్లు మద్దతుగా నిలిచారు.
ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, వైస్ ప్రెసిడెంట్బియ్యాల వెంకటస్వామి మాట్లాడుతూ.. డిప్యూటీ మేనేజర్వెంకటేశ్వర్లు కార్మికులపై పనిభారం మోపుత.. అకారణంగా సస్పెండ్ చేస్తున్నారని, ఛార్జిషీట్ లు ఇస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. స్పందించిన యాక్టింగ్ మేనేజర్ నిఖిల్ అయ్యర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ పై చర్య తీసుకోవాలని ఐఎన్టీయూసీ ఏరియా వైస్ప్రెసిడెంట్ భూమయ్య, ఆర్గనైజింగ్సెక్రటరీ నరేందర్ డిమాండ్ చేశారు.