కోచ్​ ఫ్యాక్టరీని రాజకీయాలకు వాడుకోవద్దు

కోచ్​ ఫ్యాక్టరీని రాజకీయాలకు వాడుకోవద్దు

కాజీపేట, వెలుగు: కాజీపేటకు కోచ్ ​ఫ్యాక్టరీ అంశాన్ని వివిధ పార్టీల నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్​ జాయింట్ యాక్షన్​ కమిటీ కన్వీనర్​ దేవులపల్లి రాఘవేందర్​ అన్నారు. ఓరుగల్లు లీడర్లు శ్రద్ధ చూపకపోవడం వల్లే కాజీపేటకు సాంక్షన్​ అయిన కోచ్​ ఫ్యాక్టరీని పోగొట్టుకున్నామని చెప్పారు. కాజీపేటలోని రైల్వే ఇంగ్లిష్​ మీడియం స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేటకు కోచ్​ ఫ్యాక్టరీ డిమాండ్​ ఎప్పటినుంచో ఉందని, కోచ్​ఫ్యాక్టరీ సాధన కోసం పోరాటం చేస్తున్నామన్నారు. మెదక్​ జిల్లాలో ఇదివరకు సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ప్రైవేటు కోచ్ ​ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని, దీంతో కేంద్రం మరో కోచ్​ ఫ్యాక్టరీని మంజూరు చేయడం అనుమానమేనన్నారు. 

ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న పీవోహెచ్, వ్యాగన్​ మ్యాన్​ఫ్యాక్చరింగ్ ​యూనిట్లను తాము స్వాగతిస్తున్నామని, వాటి ద్వారా ఐదారు వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కానీ, కొంతమంది పీవోహెచ్​, వ్యాగన్ పరిశ్రమలతో ఉద్యోగాలు రావని భయాందోళనకు గురిచేస్తున్నారని,  అపోహలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమల ఏర్పాటుకు 150 ఎకరాలు మాత్రమే ఇచ్చిందని, మిగతా 10.17 ఎకరాలు కూడా ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని చెప్పారు. కాజీపేటకు వచ్చిన పీవోహెచ్​, వ్యాగన్ మ్యాన్​ఫ్యాక్చరింగ్​ ఫ్యాక్టరీలను ఎవరూ తప్పు పట్టొద్దని, వాటితో పాటు కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా సాధించడానికి నాయకులు పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ చైర్మన్​ కొండ్రా నర్సింగారావు, నాయకులు పాక వేద ప్రకాశ్​, అనుమల శ్రీనివాస్​, కృష్ణమూర్తి పాల్గొన్నారు.