2016 లో కాజీపేటకు రైల్వే పీరియాడికల్ ఓవర్​హాలింగ్ షెడ్ శాంక్షన్

2016 లో కాజీపేటకు  రైల్వే పీరియాడికల్ ఓవర్​హాలింగ్ షెడ్ శాంక్షన్
  • 160 ఎకరాలకు 150 ఎకరాలు మాత్రమే అప్పగించిన రాష్ట్ర  సర్కార్
  • మరో 10 ఎకరాలపై ఏడాదిన్నరగా కిరికిరి
  • ల్యాండ్ ఇవ్వాలని గతంలోనే  లెటర్లు రాసిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి
  • ఈమధ్యే రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
  • స్థలం ఇచ్చామంటున్న బీఆర్ఎస్ నేతలు
  • వాదనలు తప్ప.. ముందుకు సాగని ప్రాజెక్టు

హనుమకొండ, వెలుగు: సౌత్​ సెంట్రల్​ రైల్వేలో  కీలక జంక్షన్​ కాజీపేటకు  కేంద్ర ప్రభుత్వం శాంక్షన్​ చేసిన పీరియాడికల్​ ఓవర్​ హాలింగ్​ వర్క్​షాప్​(పీవోహెచ్​)కు  కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన జాగ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం  కిరికిరి పెడుతుండటంతో  పీవోహెచ్​కు పునాది పడడం లేదు.  దాదాపు ఐదారు వేల మంది యూత్​కు ఉపాధి కల్పించే ప్రాజెక్టు కావడం,  పీవోహెచ్​ తర్వాత వ్యాగన్​ తయారీ ఫ్యాక్టరీ  కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థలాన్ని అప్పగించాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ రైల్వే జేఏసీ లీడర్లు  పార్టీలకు అతీతంగా ఆందోళనలు చేస్తున్నారు.  కాజీపేటలో రైల్వే ప్రాజెక్టు ​ నిర్మాణానికి సరిపడా స్థలం ఇచ్చామని, కోచ్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే  ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకుంటుండగా..  పీవోహెచ్​కు అవసరమైన స్థలం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లను బీజేపీ వైరల్​ చేస్తోంది. దీంతో ఇరువర్గాల వాదనలు తప్ప ప్రాజెక్టుకు అడుగులు పడకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

160 ఎకరాల్లో.. రూ.383 కోట్ల ప్రాజెక్ట్​

కాజీపేటకు  కోచ్​ ఫ్యాక్టరీ శాంక్షన్​ చేయాలనే డిమాండ్​ దశాబ్దాల నుంచి ఉంది. 1982లో అప్పటి కాంగ్రెస్​ సర్కారు కాజీపేటకు కోచ్​ ఫ్యాక్టరీని ప్రకటించినా.. వివిధ రాజకీయ కారణాలతో  అది కాస్త పంజాబ్​ లోని కపుర్తలాకు తరలిపోయింది.  ఆ తర్వాత  2007లో  వ్యాగన్​ వీల్ వర్క్​ షాప్  శాంక్షన్​ చేసినా రాష్ట్ర ప్రభుత్వం టైమ్​కు  జాగ ఇవ్వకపోవడంతో  అది కర్నాటకలో ఏర్పాటు చేశారు. ఇక్కడికి శాంక్షన్​ అయిన రెండు మేజర్ ప్రాజెక్టులు చేజారగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.383 కోట్ల ఖర్చుతో కాజీపేటకు ‘పీరియాడికల్​ ఓవర్​ హాలింగ్’​(పీవోహెచ్​)  వర్క్​షాపు మంజూరు చేసింది.  వర్క్​ షాపు ఏర్పాటుకు అవసరమైన 160 ఎకరాలను రైల్వే శాఖకు హ్యాండోవర్​ చేయాల్సిందిగా కోరింది.  దీంతో గతంలో కోచ్​ ఫ్యాక్టరీ, వ్యాగన్​ వీల్​ తయారీ ప్రాజెక్టులకు ప్రపోజల్స్​ చేసి మడికొండ రామలింగేశ్వరస్వామి ఆలయ భూములను పీవోహెచ్​ ఏర్పాటుకు పరిశీలించారు.  అవన్నీ ఎండోమెంట్​ భూములు కాగా.. ఆ స్థలాన్ని  సాగు చేసుకుంటున్న  రైతులకు పరిహారం ఇచ్చి దాదాపు 150.5 ఎకరాలను ఎండోమెంట్​ నుంచి రైల్వే శాఖకు మ్యూటేషన్​ చేసి 2021 ​ జనవరి 6న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చేతులమీదుగా  రైల్వే ఆఫీసర్లకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మిగతా పది ఎకరాలు అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.

10 ఎకరాలు ఇస్తలేరు..

పీవోహెచ్​ వర్క్​ షాపు కోసం నాలుగైదు నెలల కిందట రైల్వే శాఖ టెండర్లు కూడా పిలించింది.  దీంతో హైదరాబాద్​ కు చెందిన ఓ సంస్థ టెండర్​ దక్కించుకోగా.. రైల్​ వికాస్​ నిగమ్​ లిమిటెడ్​ వర్క్​ ఆర్డర్​ కూడా ఇచ్చింది.  కానీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇదివరకు ఇచ్చిన 150 ఎకరాలకు ఇంకో 10 ఎకరాలు సేకరించి ఇవ్వాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. 2021 అక్టోబర్​ లో అక్కడి  రైతుల నుంచి మరో 9.03 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం రైల్వేశాఖకు మ్యూటేషన్ చేయకుండా ఆపేసింది.  దానికి తోడు ప్రాజెక్టుకు వెళ్లే ప్రవేశ మార్గంలో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన 1.17 ఎకరాల ల్యాండ్​ ఉండగా..  దాన్ని సేకరించాల్సి ఉంది. కానీ ఈ మొత్తం ల్యాండ్​ ను రైల్వేశాఖకు అప్పగించడంలో  ఇక్కడి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడు నెలల కిందట భూమి అప్పగిస్తామని చెప్పడంతో రైల్వే ఆఫీసర్లు  ప్రతిపాదిత స్థలాన్ని చదును చేసి, సాయిల్​ టెస్ట్ కూడా చేశారు. కానీ ఆ తర్వాత ల్యాండ్​ అప్పగింతలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆ స్థలంలో  పిచ్చిచెట్లు పెరిగాయి. ఈ క్రమంలో  తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల పీవోహెచ్​ సాధన కోసం ధర్మ పోరాటదీక్ష చేపట్టి  నిరసన వ్యక్తం చేశారు. 

కోచ్​ ఫ్యాక్టరీకి ఎన్నివేల ఎకరాలైనా ఇస్తం..

కాజీపేటలో రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ ఇటీవల 49, 50 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా స్పష్టం చేశారు.  ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇదిలాఉంటే తాము పీవోహెచ్​ అడగలేదని,  కోచ్​ ఫ్యాక్టరీకి ఎన్నివేల ఎకరాలైనా ఇస్తామని ఏప్రిల్​ 29న భారత్​ ఆత్మగౌరవ్ ట్రైన్​ ఓపెనింగ్​ టైమ్​లో చెప్పారు. పీవోహెచ్​కు అవసరమైన 10 ఎకరాల స్థలం ఇవ్వకుండా.. కోచ్​ ఫ్యాక్టరీకి ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తామనడమేంటని స్థానికంగా చర్చ జరుగుతోంది. 

ఎవరి మాట వాళ్లదే..

పీవోహెచ్​ పనులు స్టార్ట్ అయిన తర్వాత వ్యాగన్​ ఫ్యాక్టరీ కూడా ప్రారంభించేందుకు కేంద్రం రెడీగా ఉంది. ఈ ప్రాజెక్టుకు రూ.581 కోట్ల వరకు ఫండ్స్​ కేటాయించింది.  కానీ  పీవోహెచ్​ ఏర్పాటు విషయమై ఇక్కడి అధికార బీఆర్​ఎస్​, ప్రతిపక్ష బీజేపీ తలోమాట చెప్తున్నాయి.  ఇరుపార్టీల వాదనలతోనే కాలం గడుస్తోంది తప్ప ప్రాజెక్టు ఏర్పాటుకు మాత్రం అడుగులు పడడం లేదు. 

యువతకు ఉపాధి చూపాలి..

పీవోహెచ్​ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు అప్పగిస్తే పనులు స్టార్ట్​ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్​ ప్రారంభమైతే ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి.  స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్థలం అప్పగించేందుకు చొరవ చూపాలి. -  దేవులపల్లి రాఘవేందర్​, కన్వీనర్​, తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్​ జేఏసీ