రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా మే 16వ తేదీ గురువారం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కేసీఆర్ ఆదేశించారు. 

రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసం చేసిందని కేసీఅర్ అన్నారు.  పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటోందని మండిపడ్డారు. ఇది..రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాల్సిందేనని.. కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు కాంగ్రెస్ ను వదలబోమని, వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు.