తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్​ ఫ్యామిలీ దోచేసింది

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్​ ఫ్యామిలీ దోచేసింది
  •    స్టేషన్​ ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి​ 
  •     కేసీఆర్ కుటుంబ ప్రస్తుత ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
  •     బీఆర్ఎస్ లో రెండోస్థానం కోసం బావబామ్మర్దులు పోటీ 
  •     బీజేపీలో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నరని ఫైర్ 

జనగామ, వెలుగు :  పదేండ్ల తెలంగాణను కేసీఆర్​ఫ్యామిలీ లూటీ చేసిందని స్టేషన్ ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్న ఆ కుటుంబానికి నీతి, నిజాయితీ గురించి మాట్లాడే నైతికత లేదని ఫైర్ అయ్యారు. 2014కు ముందు.. ప్రస్తుతం ఉన్న వారి ఆస్తుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గత ప్రభుత్వ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలు బాగా లేవని అడిగితే కేసీఆర్​తనను పక్కన పెట్టాడని ఆరోపించారు. తీవ్ర ఆర్థిక లోటున్నప్పటికీ సీఎం రేవంత్​రెడ్డి పక్కా ప్రణాళికతో చక్కటి పాలన అందిస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు.  కేసీఆర్​ఫాంహౌజ్​నుంచి ఎప్పుడు బయటకు వస్తడో తెల్వదని, కానీ.. ఆయన తర్వాత స్థానంపై బావ బామ్మర్దులు పోటీ పడుతున్నారన్నారు. పదేండ్లలో సంపాదించిన అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్​ లీడర్లు పైసలిచ్చి పెయిడ్ ఆర్టికల్స్​ రాయించు కుంటున్నారని విమర్శించారు.  ఒకరిని మించి ఒకరు పేపర్లలో ఫొటోల కోసం ప్రెస్​మీట్​లు పెట్టి  రేవంత్​సర్కారుపై అక్కసు వెళ్లగక్కు తున్నా రని ఆయన మండిపడ్డారు.  బీజేపీ లీడర్లకు అధికార యావ తప్ప మరొకటి లేదని విమర్శించారు. కిషన్​రెడ్డిది ఒక మాట, ఈటల రాజేందర్​ది మరో మాట, రఘునందన్​రావుది ఇంకో మాట అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తున్నారన్నారు. హైడ్రాను రఘునందన్​రావు సమర్ధిస్తే ఈటల వద్దంటుండని,  దమ్ముంటే అందరూ కలిసి ప్రెస్​మీట్​పెట్టి బీజేపీ వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్​చేశారు.