తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న

తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న

భారత రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో కనుమరుగు..జాతీయ సంకీర్ణ  ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.  ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తనను తాను అనేక ఆటుపోట్లతో,  భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఘోరంగా విఫలమవడానికి తాజా ఉదాహరణ బీఆర్ఎస్​.  ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి,  కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్రభాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల  చంద్రశేఖరరావు.. టీఆర్ఎస్ స్థాపించి అనంతరం పార్టీ పేరును బీఆర్ఎస్​గా మార్చి  అధోగతిపాలు చేశారు. 

దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో బీఆర్ఎస్​  పాత్ర గగుర్పాటు కలిగించింది.  విద్యార్థి ఉద్యమంతో అడుగుపెట్టి,  ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, కనుమరుగైన నాయకుడు ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ  తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.

ఆయన యువజన కాంగ్రెస్​లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్​లో  తన పిలుపుమేరకు,  గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్​ను నిశితంగా గమనించిన వ్యక్తిగా  నా పరిశీలన ఇది.  పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంది. వారందరిపట్ల సానుభూతితో,  దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ ఛిద్రమవుతున్నందుకు విచారం. 

సబ్బండ వర్గాలకు మానసిక వేదన

ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి  కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం తెలంగాణ సబ్బండ వర్గాలకు మానసిక వేదన మిగిల్చింది.  కాళేశ్వరం  సమగ్ర  గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని,  మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగేవరకు జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుక పలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది.  

తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు. నిరంతర విద్యుత్ సరఫరా  లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కీడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం క్రమంగా  ముళ్ళకంచెలుగా మారాయి.  తిరగబడినవారిని ముప్పుతిప్పలు పెట్టడం జనానికి అసహనం కలిగించింది. 

కేసీఆర్ శత్రు భయంకరుడు 

పథకాల అమలు పర్యావసనాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమైంది. సొంత పార్టీలోనే తాము పరాయిలమని నేతలు భావించే పరిస్థితి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ,  ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి.  తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే.

కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితికి జనం రాలేరు. ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనిన తర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే!  ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు అంటారు కేసీఆర్.  అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు.  ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది.  తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం. 

ప్రధాని పదవికి కేసీఆర్​ పోటీ!

మొన్న లోక్​సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన కేవలం ఊహాగానాలు కోసమే.  తెలంగాణలో 15 లోక్​సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే,  300 స్థానాలు కలిగిన పార్టీనో,  కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడుచోట్ల అయినా గెలుస్తారా అంటే నమ్మకంగా  చెప్పలేని పరిస్థితి.  మూడు సీట్లు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలంతో ఏం చేయగలడు.

 అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని,  వేరేవైపు ఓటు మళ్ళించారు.  జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థితి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు. పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి  మంత్రసానితనమెందుకు?  ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాలవారు, వారి సానుభూతిపరులు తెలంగాణలో ఆయనను శత్రువుగా నిర్ధారించారు.  

వేరే పార్టీల శాసన సభ్యులతో  జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి భావోద్వేగం అడుగంటింది.

  రాపోలు
ఆనంద భాస్కర్,
రాజ్యసభ మాజీ సభ్యుడు