రాజకీయ గాయాల నుంచి కేసీఆర్​కోలుకుంటున్నట్లేనా!

రాజకీయ గాయాల నుంచి కేసీఆర్​కోలుకుంటున్నట్లేనా!

కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే  కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ  సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు.  విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ..ఏ క్షణాన్నయినా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఉన్నా అన్నారు.

లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్  జైల్లోఉన్న కూతురు కవిత పరిస్థితిపై  తీవ్రంగా  కలత  చెందుతున్నట్టు ఆయన భావోద్వేగం  స్పష్టం చేస్తోంది.  ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తనకు తెలుసన్నారు.  ‘పార్టీ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక’ రూపొందిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు, తన పార్టీ  ‘భారత రాష్ట్ర సమితి’ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో.. అంతర్లీనంగా ఎంతో రాజకీయ సందేశం ఇమిడి ఉంది.  

భారత రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చినా, మార్చకపోయినా... వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీలో జవజీవాలు నింపి, కొత్త రూపునివ్వడానికి అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తాను స్వయంగా పాల్గొనాలని నిర్ణయించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రతిమాట, తీసుకునే  ప్రతి నిర్ణయాన్నీ రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు.

వీలయిన ప్రతికోణంలో సర్కారును ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.  ‘ఏడెనిమిది నెలలు నిరీక్షించాం, ఇక చాలు.... హానీమూన్ సమయం ముగిసింది, పాలనలో ఎక్కడా ఏదీ  కుదురుకోవడం లేదు.  ప్రజాపక్షం వహించి పోరాడటమే సత్వరం అనుసరించాల్సిన మార్గమనే సందేశాన్ని ఆయన తన పార్టీ శ్రేణులకిచ్చారు.  

రాజకీయ పంథాపై కేసీఆర్​ స్పష్టత

పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు డస్సిపోకుండా ఉండేందుకు ఇలాంటి అనునయింపు మాటలు కేసీఆర్ ఇదివరకెన్నోమార్లు చెప్పినా... ఇప్పుడు చెబుతున్న మాటలు కాస్త భిన్నంగా ఉన్నాయి.  బయట ప్రచారంలో ఉన్న పలు ఊహాగానాలకు తెరదించుతూ, రాజకీయంగా తన పంథా ఎలా ఉండబోతోందో  స్పష్టమైన సందేశమే ఇచ్చారాయన.

అసెంబ్లీ, లోక్​సభ..రెండు ఎన్నికల్లోనూ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బకు బీఆర్ఎస్ చతికిలపడిపోయి ఉన్న తరుణంలో  ఏదేదో  ప్రచారంలోకి వచ్చింది. ఇక  బీఆర్ఎస్ పార్టీ నిలువదని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని, ఇంకో అడుగు ముందుకేసి.. ఏకంగా పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారని.. సగటు మనిషి ఊహాగానాలు ఎన్నో ప్రచారంలోకి వచ్చాయి. దీంతో  తన ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, రాజకీయ పరిణతిని మేళవిస్తూ విధాన ప్రకటన చేసి ఒకరకంగా ప్రచార పుక్కిటి పురాణాలకు ఆయన తెరదించారు.

బీజేపీ అధినేతలపై విమర్శలు

‘కన్న కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రికి బాధ ఉండదు?’ అని ప్రశ్నిస్తూ.. ఎన్నో విషయాలను మనసులో దిగమింగుకుంటున్నానని, సమయం వచ్చినపుడు ఏది ఎలా చేయాలో తనకు బాగా తెలుసనీ కేసీఆర్ స్పష్టం చేశారు. తనను ఎదుర్కోలేకే ఇలా చేశారనీ బీజేపీ అధినాయకత్వాన్ని విమర్శించారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ.. రెండింటికీ సమదూరం పాటించడం ద్వారా ప్రజాక్షేత్రాన్ని ఎదురులేకుండా సొంతం చేసుకోవచ్చని ఆయనకు తెలుసు.

రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు తప్పక విఫలమవుతాయని, తద్వారా విపక్షంగా ప్రజల మనసు గెలవటానికి బీఆర్ఎస్​కు పుష్కలమైన అవకాశాలుంటాయన్నది ఆయన గట్టి నమ్మకం.  

ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలినా..కాంగ్రెస్​ గెలిచింది

ఎమ్మెల్యేలుగా ఎదగడానికీ విపక్షమే సరైన స్థానమని ఉద్బోధించారు. అందుకే, ‘వెళ్లినవాళ్లు ఏం నష్టపోయారో వారికి తర్వాత తెలుస్తుంది’ అని తన మనసులోని మాట చెప్పారు. ‘వారికి ఏం తక్కువ చేశామని వెళ్లారు? మనం రెండు, మూడు పదవులు ఇచ్చినవారు కూడా వెళ్లారు. సరే, వారి ధర్మం అలా ఉంది’ అంటూ వెళ్లినవారిని, మిగిలిపోయిన తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముందు తప్పుబట్టారు.

అలా వలస వెళ్లిన ప్రజాప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయించే న్యాయప్రక్రియ  కొనసాగుతుందని  చెప్పారు. ఒక పచ్చి నిజాన్ని వివరించే క్రమంలో ఇంకో వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరించారు కేసీఆర్!  ‘లోగడ అందరూ వెళ్లిపోయి... ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలినా కాంగ్రెస్​పార్టీని  ప్రజలు గెలిపించలేదా?’ అని ప్రశ్నించారు. పార్టీ సంక్షోభం ఎదుర్కొంటోంది.. ఇక్కట్లలో ఉందనే మాటలని అంగీకరించని ఆయన, పార్టీ పటిష్టమైన స్థితిలో ఉందని ఉద్ఘాటించారు. 

చరిత్ర చెప్పేదే సత్యం

బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళుతుందంటేనో, ఏకంగా అందులో విలీనం అవుతుందంటేనో నమ్మదగ్గ ఆధారాలేవీ చరిత్రలో లేవు. అందుకు పూర్తి వ్యతిరేక పంథాను రుజువుచేసే చారిత్రక ఆధారాలే ఎక్కువ!  వేర్వేరు సందర్భాల్లో వివిధ పార్టీలతో  కేసీఆర్ చేతులు కలిపి కూటములు ఏర్పరచినా.. బీజేపీతో ఎన్నడూ కలిసి నడవలేదు.

బీజేపీని వ్యతిరేకించే మజ్లీస్ (ఎంఐఎం) వంటి పార్టీలతో అంటకాగిన చరిత్ర ఉంది.  కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు..ఇలా ఎవరితోనైనా సఖ్యత నెరపిఉండొచ్చు.  కానీ,  బీజేపీ వైపు మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఉద్యమ కాలంలోనూ వామపక్ష భావజాలం ఉన్న నాయకులు, మేధావులు కలిసినంత సహజంగా కేసీఆర్​తోగాని, ఆయన నేతృత్వం వహించిన పార్టీ-కూటములతో కానీ బీజేపీ- ముఖ్యులెవరూ కలిసిన దాఖలాలు లేవు.  

బీజేపీ పాత వాసనలతో వచ్చి బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) లో చేరిన,  చేతులు కలిపిన ఆలె నరేంద్ర,  విజయశాంతి వంటి వారిని కూడా కేసీఆర్ దీర్ఘకాలం తనతో ఉంచుకోలేదు. పంపించడమో, వారంతటవారే  వెళ్లిపోవటమో జరిగింది. 

బీజేపీవైపు  మొగ్గు చూపని కేసీఆర్​

రెండోసారి ముఖ్యమంత్రిగా (1999-, 2004) చంద్రబాబు అయిదేండ్ల  ప్రజావ్యతిరేక పాలనలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కష్టాల కొలిమిలో సలసల కాగింది.  కల్లోల సామాజిక వాతావరణం ఊపిరులూదితే పుట్టిన ఉద్యమానికి  కేసీఆర్ శీర్షభాగాన ఉన్నారు. భావజాలపరంగా  కూడా 2001కి పూర్వం- తర్వాత  రైటిస్టుల కన్నా లెఫ్ట్  నేపథ్యం ఉన్నవారే  తెలంగాణ వాదనతో నిలబడటం, కార్యక్రమాల నిర్వహణ, పార్టీ స్థాపించి కేసీఆర్ అదే పంథా ఎంచుకోవడం..ఇవన్నీ సరళరేఖీయంగా జరిగాయి.

‘దేవత’ అన్న సోనియాగాంధీనే ‘దెయ్యం’ అని తూలనాడినా కాంగ్రెస్​తోనే తప్ప బీజేపీతో ఏ సఖ్యత, -వైరమూ కేసీఆర్​కు ఏనాడూ లేవు.  ప్రత్యేక రాష్ట్రం సాధనకు నలుగుతున్న రోజుల్లోనూ, అంతకుముందు 3 రాష్ట్రాలిచ్చిన చరిత్ర ఉంది కదా అని,  బీజేపీ వైపు మొగ్గిన వాసన కూడా కేసీఆర్​కు అంటలేదు.  కేసుల నుంచి బిడ్డ కవిత విముక్తి కోసం కేసీఆర్  బీజేపితో  లాలూచీ పడటమో, తన పార్టీని విలీనం చేయడమో జరగొచ్చన్నది కూడా ఓ ఊహ, -అంచనా మాత్రమే అని తేటతెల్లమైంది. 
తాజా ప్రకటన ఆ దిశలో మరో సాక్ష్యం మాత్రమే!

ఫక్తు రాజకీయ పక్షి

ఒక చంద్రబాబులా, ఒక వైఎస్సార్ లాగ  కేసీఆర్ ఫక్తు రాజకీయ పక్షి!  సందర్భం వస్తే.. కోపతాపాలు, వ్యక్తిగత రాగద్వేషాలను కూడా పక్కనపెట్టి భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. బీజేపీతో కలిసి ప్రయాణం అంటే ఆయన అలాగే ఆలోచిస్తారు. ఎన్నికల్లో  ఓడిన ఏడునెలల తర్వాత ఆయనో నిర్ణయానికి వచ్చారు. రాజకీయ దృక్పథాన్ని వెల్లడించారు.

ఆయనకు రాజకీయంగా సీనియర్ సహచరుడైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చి, ‘1995 నాటి చంద్రబాబును చూస్తారు’ అని ప్రకటించారు. మరి, రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం ఎటువంటి కేసీఆర్​ను చూస్తుంది? కుటుంబ రాజకీయాల నుంచి ఏమేరకు ఆయన బయటపడతారు? కనీసం తనయుడు, తనయలను ఎంతవరకు దూరం ఉంచుతారు అన్నది కీలకమవుతుంది.  

పద్నాలుగేళ్ల ఉద్యమ నేతృత్వంలో ఒక కేసీఆర్​ను  చూసిన రాష్ట్ర ప్రజానీకం పదేండ్ల పాలనలో మరో కేసీఆర్​ను  చూశారు.  సాధారణ ఊహల్ని పటాపంచలు చేస్తూ దూసుకువస్తున్న సరికొత్త కేసీఆర్ 3.0 వెర్షన్​లో ఎలా  ఉంటారు? ఇది కాలం నిర్ణయించాల్సిందే! 

- దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ