
- సింగపూర్ వెళ్తారని మరో ప్రచారం
- పాస్ పోర్టు మార్పిడి అందుకేనా?
- హిమాన్షు వద్దకు వెళ్తారని టాక్
- మనుమరాలు అలేఖ్యకు యూఎస్ లో అడ్మిషన్
- అక్కడికే వెళ్తారంటున్న కొందరు
- ప్రభాకర్ రావును కలిసేందుకే అంటున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ అమెరికా వెళ్తారని తెలుస్తోంది. మనుమరాలు అలేఖ్యకు అమెరికాలో సీటు రావడంతో ఆయన అక్కడి వెళ్లేందుకు సిద్ధమవు తున్నారని ప్రచారం సాగుతోంది.
ఇందులో భాగంగానే తన పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్నారని, డిప్లమాట్ పాస్ పోర్టును సాధారణ స్థితికి మార్చుకున్నారనే టాక్ ఉంది. అయితే మొన్నటి వరకు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కొడుకు హిమాన్షు ప్రస్తుతం సింగపూర్ విద్యాభ్యాసం చేస్తున్నారు. తాత మీద బెంగతో పదే పదే ఇండియా వస్తుండటంతో అమెరికా నుంచి సింగపూర్ కు షిప్ట్ చేయించారని తెలుస్తోంది.
ఈ క్రమంలో మనుమడి వద్ద కొంత కాలం గడిపేందుకు సింగపూర్ కు వెళ్తారని అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ఫారిన్ టూర్ పక్కా అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ పాస్ పోర్టు రెన్యూవల్ కొత్త చర్చకు తెర తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి పార్టీ బాధ్యతలను మరికొంత కాలం కేటీఆరే చూసుకునే అవకాశం ఉంది.
కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ్టి వరకు ఎర్రవెల్లి ఫాంహౌస్ లో గడిపిన కేసీఆర్.. సతీమణి శోభతో కలిసి సికింద్రాబాద్ ఫాంహౌస్ కు వచ్చారు. ఇద్దరి పాస్ పోర్టులను రెన్యూవల్ చేయించుకున్నారు. దీంతో కేసీఆర్ ఒక్కరే వెళ్తారా.. వెంట సతీమణి శోభ కూడా విదేశాలకు వెళ్తారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ పాస్ పోర్టు రెన్యూవల్ అంశంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ అమెరికా వెళ్తున్నారని, అక్కడ ప్రభాకర్ రావును కలుసుకుంటారంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా కేసీఆర్ విదేశీ పర్యటన మాత్రం పక్కా అనేది ఆసక్తికరంగా మారింది.