
- గత సమావేశాలకు హాజరైన మాజీ సీఎం.. మళ్లీ ఇప్పుడే సభకు
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అమాసకు.. పున్నానికోసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ ఉన్నప్పుడు సభకు రాని మాజీ సీఎం.. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు తెలిసింది. నిరుడు జులై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. అప్పటి నుంచి మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేదు.
కనీసం బడ్జెట్ చర్చల్లోనూ ఆయన పాల్గొనలేదు. కులగణన బిల్లు, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై డిసెంబర్ 28న జరిగిన చర్చకూ హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా డిసెంబర్ 30న నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. కీలకమైన అంశాలపై చర్చ సందర్భంగా కూడా ఆయన సభకు హాజరుకాకుండా.. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు.
అనర్హత వేటు తప్పించుకోవడానికే..
అనర్హత వేటు తప్పించుకోవడానికే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. మామూలుగా అసెంబ్లీ జరిగిన 60 పని రోజుల్లోపు కచ్చితంగా ఒక్కసారైనా సభకు హాజరు కావాలన్న రూల్ ఉంది. లేదంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సభకు కేసీఆర్ తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు మాత్రమే ఆయన హాజరవుతారా.. లేదంటే సభ జరిగినన్నీ రోజులు ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఈ మీటింగ్ జరగనుంది.