స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడికి బెయిల్‌

స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడికి బెయిల్‌

రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు సోమవారం(సెప్టెంబర్ 02) బెయిల్ మంజూరు చేసింది. సూర్య కాంత్, ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం అతనికి బెయిల్ ప్రసాదించింది. అదే సమయంలో అతనికి పలు షరతులు విధించింది. 

బిభవ్ కుమార్‌ను తిరిగి కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడిగా నియమించడం కానీ, సీఎంఏం కార్యాలయంలో బాధ్యతలు అప్పగించరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యుల విచారణ పూర్తయ్యేంత వరకూ అతన్ని ముఖ్యమంత్రి నివాసంలో  అడుగుపెట్టనివ్వరాదని ఆదేశించింది.

ఏంటి ఈ కేసు..?

కేసు ఈ ఏడాది మే 14 నాటిది. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడైన బిభవ్ కుమార్‌ ముఖ్యమంత్రి నివాసంలో తనపై దాడి చేశారంటూ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిభవ్ కుమార్ తనను పలు మార్లు చెంప దెబ్బ కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలైన ఛాతీపై, పొత్తికడుపుపై ​​తన్నాడని స్వాతి మలివాల్ ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల వేళ ఈ ఘటన అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదుతో పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్ కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించారు. నాటకీయ పరిణామాల నడుమ మే 18న ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా100 రోజులకు అతనికి  బెయిల్ మంజూరైంది.

ALSO READ | మా రాష్ట్రంలో 12 లక్షల మంది బంగ్లా దేశీయులు ఉన్నారు: శ్రీరామ్ సేన చీఫ్