లెబనాన్లో జరిగిన పేజర్ల పేలుళ్ల సంఘటనలో కేరళ వ్యక్తికి సంబంధం ఉందన్న వార్త సంచలనం రేపుతోంది. ఈ ఘటనతో కేరళకు చెందిన రిన్సన్ జొస్ అనే వ్యక్తి ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. నార్వేజియన్ పౌరసత్వం కలిగిన రిన్సన్ కేరళలోని వాయనాడ్ చెందినట్లుగా తెలుస్తోంది. రిన్సన్ బల్గేరియన్ కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్కు యజమాని అని సమాచారం. హెజ్బొల్లా దాడిలో ఉపయోగించిన పేజర్లను సప్లై చేసిన కంపెనీ రిన్సన్ కు చెందిందే కావడంతో బల్గెరియా దర్యాప్తు మొదలుపెట్టింది.
ఈ ఘటనపై స్పందించిన వయనాడ్ డిప్యూటీ ఎస్పీ పీఎల్ షిజు లెబనాన్ పేలుళ్లలో రిన్సన్ ప్రమేయంపై వార్తలు వచ్చిన తర్వాత అతని గురించి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. కాగా రిన్సన్ మంగళవారం ( సెప్టెంబర్ 17,2024 ) నుండి అందుబాటులో లేడని అతని సన్నిహితులు చెబుతున్నారు. రిన్సన్ జొస్ భార్య కూడా అందుబాటులోకి రావట్లేదని తెలిపారు. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా, సుమారు 3,000 మంది గాయపడిన సంగతి తెలిసిందే.