
- ఎంపురాన్ సినిమాకు మద్దతు
తిరువనంతపురం: మోహన్లాల్ నటించిన ఎంపురాన్ సినిమాకు కేరళ సీఎం పినరయ్ విజయన్ మద్దతిచ్చారు. ఆ మూవీని తాను కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వీక్షించానని ఆదివారం ఆయన్ ఫేస్బుక్లో వెల్లడించారు. ఎంపురాన్పై బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ వివాదం రేపుతున్నాయని, ఇది కళాకారుల భావప్రకటన స్వేచ్ఛను కాలరాయడమే అవుతుందన్నారు. కళాకారుల హక్కులను కాపాడాలని పిలపునిచ్చారు. సినిమా తీసినవాళ్లను, నటించిన యాక్టర్లను సంఘ్పరివార్, దాని అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఈ ఒత్తిడుల నేపథ్యంలో సినిమాను రీసెన్సార్ చేసి, ఎడిట్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయని నివేదికల ద్వారా తెలిసిందన్నారు. ‘‘సినిమా అనేది కళాకారుల బృందం సమిష్టి ఫలితం. సినిమాలు తీయడం, చూసి ఆనందించిడం, విభేదించడం, విమర్శ, విశ్లేషణ వంటి హక్కులకు ప్రజాస్వామ్యంలో ఆటంకాలు ఉండకూడదు”అని విజయన్ పేర్కొన్నారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి కూడా సినిమాను రీసెన్సార్ చేయాలన్న డిమాండ్లను వ్యతిరేకించారు.