అదృష్టం బాగుంది : తేడా వచ్చి ఉంటే కేరళ ఎక్స్ ప్రెస్ పట్టాలపై పల్టీలు కొట్టేది..!

అదృష్టం బాగుంది : తేడా వచ్చి ఉంటే కేరళ ఎక్స్ ప్రెస్ పట్టాలపై పల్టీలు కొట్టేది..!

లేచిన టైం బాగుందో ఏమో.. ఘోర రైలు ప్రమాదం తప్పింది. అవును నిజం.. కేరళ రాష్ట్రం త్రివేండ్రం నుంచి ఢిల్లీ వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్.. సూపర్ ఫాస్ట్ రైలు పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

త్రివేండ్రం నుంచి బయలుదేరిన కేరళ ఎక్స్ ప్రెస్.. ఢిల్లీ వెళ్లే మార్గంలో.. 2024, అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్ పూర్ పట్టణానికి సమీపంలోకి చేరుకుంది. ఇదే సమయంలో పట్టాలపై పనులు చేస్తున్న రైల్వే సిబ్బంది.. ఓ రైలు పట్టా విరగటాన్ని గుర్తించారు. 

వెంటనే అప్రమత్తం అయిన రైల్వే సిబ్బంది.. అటుగా వస్తున్న కేరళ ఎక్స్ ప్రెస్ కు ఎదురెళ్లి.. తమ దగ్గర ఉన్న ఎర్ర జెండాలను చూపించారు. అప్పటికే 100 స్పీడ్ లో ఉన్న కేరళ ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్.. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పీడ్ తగ్గించారు. 100 స్పీడ్ రైలును ఒకేసారి తగ్గించటం సాధ్యం కాదు కాబట్టి.. నిదానంగా తగ్గించుకుంటూ వచ్చారు. దీంతో 20 స్పీడ్ లో.. విరిగిన రైలు పట్టాపై నుంచి.. మూడు బోగీలు వెళ్లాయి. 

ALSO READ | కళ్లు నెత్తికెక్కి నడుపుతున్నారా.. : లారీ ఢీకొని తండ్రి కళ్లెదుటే చిన్నారి మృతి

దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పట్టాలపై రైల్వే సిబ్బంది విషయాన్ని గుర్తించకపోయి ఉంటే.. కేరళ ఎక్స్ ప్రెస్ రైలుకు అత్యంత ఘోర ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు సిబ్బంది. ఆ తర్వాత రైలును సమీపంలో ఝాన్సీ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటం అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించిన రైల్వే సిబ్బందిని అభినందించారు ఉన్నతాధికారులు. 

ఇటీవల కాలంలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పెద్ద బండరాళ్లు, ఇనుప రాడ్లు పెట్టటం తెలిసిందే. ఇవన్నీ దాదాపుగా యూపీలో జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం..