
హైదరాబాద్, వెలుగు: భూమి పోరాటాలకు, త్యాగాలకు కేరళ మారుపేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పున్నప్ర, వయలార్ వంటి ప్రజా ఉద్యమాలు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఇక్కడ జరిగిన పోరాటాలు మరువలేనివని అన్నారు. సోమవారం కేరళలోని కోజికోడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ త్రివర్ణోత్సవం పేరిట ఏర్పాటు చేసిన రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన కూలీల సమావేశంలో చీఫ్ గెస్ట్గా భట్టి మాట్లాడారు.
తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో వ్యవసాయం ఒక జీవన విధానమని చెప్పారు. అలాంటి వ్యవసాయ రంగం.. నేడు అకాల వర్షాలు, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.
కార్మికులకు అండగా నిలుద్దాం..
తెలంగాణలో రైతుల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందించామని, సన్నబియ్యం సాగు చేసే రైతుకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని వివరించారు.
సమాజాన్ని నడిపించేది అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులేనని చెప్పారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఉపాధి, ఆదాయాన్ని స్థిరంగా అందిస్తున్నామన్నారు. ఆత్మీయ రైతు భరోసా కింద తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు.
గిగ్ వర్కర్ల హక్కులను గుర్తించి వారికి ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కల్పించే విధానాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. ప్రతి రైతు అభివృద్ధి ప్రయాణంలో మనం భాగస్వాములం కావాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. కార్మికుడు ఒంటరిగా ఉండకూడదని..‘కర్షకుడిని రక్షించాలి, కార్మికుడిని కాపాడాలి’ అనే నినాదాం ఈ సమావేశానికి దిక్సూచి కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ ఆంటోని జోసెఫ్, ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, డీసీసీ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.