
కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.. వద్దా.. అన్న దానిపై తన అభిప్రాయం తెలిపేందుకు ఏజీ వెంకటరమణి నిరాకరించారు. గతంలో ఏపీ తరపున కేసుల్లో హాజరైనందున తన అభిప్రాయాన్ని చెప్పలేనని ఏజీ స్పష్టం చేశారు. దీంతో అభిప్రాయం కోసం ఫైల్ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం పంపించింది. తుషార్ మెహతా అభిప్రాయం తెలుసుకున్న తరువాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం కేంద్రం తీసుకోనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆ తరువాతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలంటూ గతంలో సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. అయితే తెలంగాణ పిటిషన్ ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో రాష్ట్రం ఆ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. కానీ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తోనే విచారణ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. న్యాయశాఖ అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంపించిన కేంద్రం.. ఆయన అభిప్రాయం తరువాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.