కేటీఆర్ బామ్మర్దికి రెండు రోజులు టైమ్ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు

కేటీఆర్ బామ్మర్దికి రెండు రోజులు టైమ్ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కేటీఆర్ బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు రాజ్‌పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జన్వాడ ఫామ్ కేసు విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల తరఫున ఏఏజీ కోర్టుకు తెలపగా.. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది.

కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని పోలీసులు ఈ కేసులో ఏ1, ఏ2  నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని.. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

ALSO READ | జన్వాడ ఫామ్ హౌస్ కేసు : విచారణకు విజయ్ మద్దూరి డుమ్మా.. కేటీఆర్ భార్యనూ విచారించిన పోలీసులు

ఈ పిటిషన్‎పై 2024, అక్టోబర్ 28న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల ముందు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, జన్వాడ్ ఫామ్ కేసులో కీలక నిందితుడైన రాజ్ పాకాల నివాసం ఓరియన్ విల్లాలో ఆదివారం (అక్టోబర్ 27) పోలీసులు సోదాలు  చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్ పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్ పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.