![విచారణలో సీఐ నాగేశ్వరరావు నేరం అంగీకరించారు](https://static.v6velugu.com/uploads/2022/07/ci-nageswara-rao,remand-report,marredpally-ci,hyderabad-police,_jFOv2SCfXW.jpg)
అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలకాంశాలను ప్రస్తావించారు. వెంకటరమణ కాలనీలో రాత్రి 9.30 కు ఘటన జరిగినట్లుగా రిమాండ్ రిపోర్టులో ఉంది. దర్యాప్తులో నాగేశ్వరరావు నేరం అంగీకరించారని.. హత్యాయత్నం, అత్యాచారం, బెదిరింపులు, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని రిపోర్ట్ పోలీసులు పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. సీఐ సర్వీస్ రివాల్వర్తో పాటు దుస్తులు.. బాధితురాలి ఇంటి దగ్గరలోని ఎలక్ట్రికల్ షాప్లో సీసీ ఫుటేజ్ సేకరించినట్లు రిపోర్టులో తెలిపారు. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని..బాధితురాలికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపినట్లు చెప్పారు. సీన్ ఆఫ్ ఆఫెన్స్లో కీలక ఆధారాలు సేకరించామన్న పోలీసులు..2 గాజులు, తల వెంట్రుకలు, బెడ్షీట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంట్లో నుంచి ఆరుపులు, కేకలు వినిపించాయని స్థానికులు చెప్పారని..సాగర్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రయాణించిన సీసీ ఫుటేజ్ కూడా సేకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు.
అసలు కేసు ఏంటీ..?
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బెదిరించి..అతని భార్యను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2018లో నమోదైన ఓ కేసులో వనస్థలిపురం హస్తినాపురానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న సీఐ నాగేశ్వరరావు.. నిందితుడికి బెయిల్ వచ్చాక తన పొలంలో పనికి పెట్టుకున్నాడు. అతను, తన భార్యతో కలిసి నాగేశ్వర్రావుకి చెందిన పొలంలో పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లో లేని సమయం చూసి..అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీఐ.
నేరుగా ఇంటికెళ్లి అత్యాచారం
నిందితుడు సొంత ఊరికి వెళ్లాడని తెలిసి..ఈ నెల 6వ తేదీన బాధితురాలికి నాగేశ్వర రావు మరోసారి వాట్సాప్ కాల్ చేసి..అసభ్యకరంగా మాట్లాడాడు. తన లైంగిక కోర్కెలు తీర్చాలని బెదిరించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నేరుగా హస్తినాపురంలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెపై దాడి చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. భార్య ఏడుపులు విని డోర్స్ పగులగొట్టి ఇంట్లోకి వచ్చాడు. నాగేశ్వర్రావుపై కర్రతో దాడి చేశాడు. దాంతో సీఐ రివాల్వర్ ను బయటకు తీశాడు. చెప్పినట్లు వినకుంటే బ్రోతల్ కేసు పెడతానని దంపతులిద్దరిని బెదిరించి ఓ వెహికిల్లో ఎక్కించి.. వనస్థలిపురం నుంచి ఇబ్రహింపట్నానికి బయలుదేరాడు. కారు వెనుక సీట్లో బాధితురాలు కూర్చోగా..ఆమె ముందు సీట్లో నాగేశ్వర్రావు కూర్చున్నాడు. బాధితురాలి భర్తను డ్రైవ్ చేయాలని గన్పెట్టాడు. మార్గ మధ్యలో ఇబ్రహింపట్నం సమీపంలోని చెరువు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుని వనస్థలిపురం వచ్చారు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.