
- ఖమ్మం వన్టౌన్, త్రీ టౌన్ మధ్య రాకపోకలకు ఇబ్బంది
- నష్టపోతున్న వ్యాపారులు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో రైల్వే మధ్య గేట్ మూసివేతతో అక్కడి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వన్టౌన్, త్రీ టౌన్ ప్రాంతాలను కలిపే ఈ గేట్ ను మూసేసి, 2 నెలలవుతోంది. మూడో రైల్వే లైన్ పనులు చేపడుతుండటమే ఇందుకు కారణం. ఈ గేటుకు ఒకవైపు కస్బా బజార్, రావిచెట్టు బజార్ ఉండగా ఇక్కడే వందల సంఖ్యలో హోల్ సేల్ వస్త్ర దుకాణాలు, స్టీల్, అల్యూమినియం షాపులున్నాయి. మరోవైపు గాంధీ చౌక్లో బంగారం, కిరాణా దుకాణాలున్నాయి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం జరిగే గాంధీ చౌక్ ప్రాంతంలో కీలకంగా ఉండే మార్గాన్ని మూసివేయడంతోపాటు, తాజాగా మరో మూడు, నాలుగు నెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడంతో వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ చౌక్ నుంచి కమాన్బజార్, కస్బా బజార్ మధ్య రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వ్యాపారులు, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి, అండర్ బ్రిడ్జి నిర్మించాలని
కోరారు.
గాంధీ చౌక్ నుంచి ర్యాలీ
రైల్యే మధ్య గేట్ను మూసివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం త్రీటౌన్పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆర్జేసీ కృష్ణ, బీజేపీ నాయకుడు ఉదయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో నాయకులు గాంధీచౌక్ నుంచి మధ్య గేట్వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత రైల్యే డిప్యూటీ చీఫ్ఇంజినీర్ రామారావుకు వినతిపత్రం అందించారు. మధ్య గేట్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, 8 మీటర్ల వెడల్పుతో అండర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని మేనేజర్ హామీ ఇచ్చారు.