
కొండాపూర్, వెలుగు: దావత్లో మటన్ ముక్కలు వేయలేదనే కోపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల కింద మంచిర్యాల జిల్లా అంకుశాపూర్కు చెందిన 15 మంది కూలీలు సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ శివారులోని శ్రీసాయి బాలాజీ నర్సరీలో మామిడి మొక్కలకు అంటు కట్టేందుకు వచ్చారు. ఈ నెల 15న సాయంత్రం పని ముగించుకుని వారు ఉంటున్న రేకుల షెడ్డు వద్ద దావత్ చేసుకున్నారు. భోజనం టైంలో దయనేని శివ, గోస్కుల పాపన్న (37) ఇద్దరి మధ్య మటన్ వడ్డించే విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో శివ ఇనుప పైపుతో పాపన్నను కొట్టాడు. తలకు బలమైన గాయం కాగా అతడిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం పాపన్న మృతిచెందాడు.