మూడో సీజన్​ వచ్చినా.. సీఎంఆర్​ కంప్లీట్​ చేస్తలే

మూడో సీజన్​ వచ్చినా.. సీఎంఆర్​ కంప్లీట్​ చేస్తలే
  • యాదాద్రిలో 1.47 లక్షల టన్నులు పెండింగ్​ ​ 
  • సూర్యాపేటలో 2.19 లక్షల టన్నులు, నల్గొండలో 1.01 లక్షల టన్నులు పెండింగ్​
  • ఇకనుంచి బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే మిల్లర్లకు వడ్లు

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : సీజన్లు మారుతున్నా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించడంలో  జిల్లాకు చెందిన మిల్లర్లు లేట్ చేస్తున్నారు. మూడో సీజన్​ సమీపించినా ఒక్క సీజన్ బియ్యం పూర్తిగా అందించడం లేదు. గడువులోపు బియ్యం ఇవ్వాలని, లేకుంటే  ఫైన్​ వేస్తామని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా  మిల్లర్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వానాకాలం సీజన్ సీఎంఆర్ బియ్యం మార్చిలో, రబీ సీజన్​   బియ్యం సెప్టెంబర్​ అప్పగించాలి.  కానీ కొన్ని మినహా అన్ని మిల్లులు  జాప్యం చేస్తున్నాయి.

యాదాద్రిలో 1.47 లక్షల టన్నులు​ పెండింగ్​

2023 వానాకాలం సీజన్​కు సంబంధించి 47 మిల్లులకు 2,65,197 టన్నుల వడ్లు అప్పగించారు. దీంట్లో 1,77,682 టన్నుల సీఎంఆర్​ డెలీవరీ చేయాల్సి ఉండగా 1,42, 145 (80 శాతం) టన్నులు  డెలివరీ చేశారు. 47 మంది మిల్లర్లలో కేవలం 8 మంది మాత్రమే వంద శాతం సీఎంఆర్​ అప్పగించారు.     -2023–-24 యాసంగి సీజన్​ వడ్లు 37 మిల్లులకు 2,70,635 టన్నుల వడ్లను అప్పగించగా..  1,81,325 టన్నుల సీఎంఆర్​ అప్పగించాల్సి ఉంది.  ఇప్పటివరకూ   68,903 టన్నులు అంటే 38 శాతం  డెలివరీ చేశారు. ఈ సీజన్​ ఏ ఒక్క మిల్లు కూడా వంద శాతం సీఎంఆర్​ ఇవ్వలేదు. 

సూర్యాపేటలో 2.19 లక్షల టన్నులు

సూర్యాపేటలో 2023 వానాకాలంలో 1,96 లక్షల టన్నుల వడ్లను 63 మిల్లులకు కేటాయించింది. 1.39 లక్షల టన్నుల సీఎంఆర్​ అప్పగించాల్సి ఉంది. ఇంకా 78,190 టన్నుల సీఎంఆర్ పెండింగ్ లో ఉంది.  -2023 -–24 యాసంగిలో 2.08 లక్షల టన్నుల వడ్లను 47 మిల్లులకు కేటాయించింది. 1,63,200 టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 22 వేల టన్నుల సీఎంఆర్​ అందించారు. 

నల్గొండలో 1.01 లక్షల టన్నులు

2023 వానాకాలంలో జిల్లాలోని మిల్లులకు 3,22,754 టన్నుల వడ్లు అప్పగించగా 2,17,577టన్నుల సీఎంఆర్​ అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ 1,95,827 టన్నులు (90 శాతం అప్పగించారు. మరో 21750 టన్నులు పెండింగ్​లో ఉంది.  -2023-24 యాసంగి సీజన్​లో 3,26,012 టన్నుల వడ్లు అప్పగించగా 2,21,569 టన్నుల సీఎంఆర్​ అప్పగించాల్సి ఉండగా 1,41,586 టన్నులు (64 శాతం) అప్పగించారు. ఇంకా 79,983 టన్నులు పెండింగ్​లో ఉంది. 

మిల్లులపై ఆర్​ ఆర్​ యాక్ట్​

సీఎంఆర్​ కోసం ఇచ్చిన వడ్లు మిల్లుల్లో లేక పోవడంతో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని కొన్ని మిల్లులను ఇప్పటికే ప్రభుత్వం బ్లాక్​ లిస్ట్​లో పెట్టింది. దీంతో పాటు ఆయా మిల్లులను సీజ్​ చేయడంతో పాటు పోలీస్​ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ రికవరీ (ఆర్​ఆర్​) యాక్ట్​ కూడా ప్రయోగించింది. ఆ మిల్లర్ల ఆస్తులను వేలం వేయడం ద్వారా బకాయిని రాబట్టుకునే ప్రక్రియ నడుస్తోంది.

మరికొందరు మిల్లర్లు సకాలంలో సీఎంఆర్​ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఆలస్యంగా సీఎంఆర్​ ఇచ్చిన వారి నుంచి 25 శాతం అదనంగా వసూలు చేస్తామని హెచ్చరించినా పట్టించుకోని మిలర్లకు 25 శాతం పెనాల్టీ విధించారు.

అయితే ఈ పెనాల్టీ కట్టకుండా ఎలాగైనా తప్పించుకోవాలని కొందరు మిల్లర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల్లోని ఒక్కో మిల్లులో రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ విలువైన బియ్యం అందించాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలోని రెండు మిల్లులు మాత్రం రూ. 60 కోట్ల నుంచి రూ . 100 కోట్ల విలువైన బియ్యం అందించాల్సి ఉంది.